సాహిత్య ప్రస్థానం, మే 2023

ఈ సంచికలో ...

కథలు
లచ్చమ్మ : శాంతి శ్రీ
చచ్చేంత ప్రేమ : అను: డా.వెన్నా వల్లభరావు
కూలి రోగులు : వి.రెడ్డెప్ప రెడ్డి
మత్తు కమ్మిన రాత్రి : శింగమాల సుబ్రహ్మణ్యం

కవితలు
తానొక జ్వరమానిని : పుట్టి గిరిధర్‌
ప్లీజ్‌ ...! : ఈతకోట సుబ్బారావు
లిప్తకాలపు స్వప్నాలు : కంచరాన భుజంగరావు
నవనవోన్మేషమై ... : కోరాడ అప్పలరాజు
మట్టిప్రేమ : గవిడిి శ్రీనివాస్‌
ఆకలి : అల్లాడి శ్రీనివాస్‌

లచ్చమ్మ

శాంతిశ్రీ
83338 18985

'ఏమేవ్‌.. ఈ రోజు మన నడిపోడు వస్తున్నాడు గందా.. ఆడికి టమాటా పచ్చడంటే ఇష్టంగా.. చెయ్యరాదూ..?! నిన్న చేలో నుండి పచ్చి మిరగాయలు, టమాటాలు తెచ్చానుగా..' కళ్లు ఎగరేస్తూ.. పంచె కొంగు నడుములో దోపుకుంటూ.. సూరిలో కొడవలి చేతిలోకి తీసుకుంటూ.. దాని పదును బటెనవేలుతో రుద్ది చూస్తూ.. చెప్తూనే పొలం పోవడానికి బయటకు అడుగులేస్తున్నాడు రంగయ్య.
'ఏమయ్యో... ఇదిగో అన్నం.. కొడుకొస్తన్నాడని నాకన్నా నువ్వే మా బాగా సంతోషపడుతున్నావనుకుంటా.. ఆర్డర్లు ఏసేస్తున్నావు.. ఆడికిష్టమనీ టమాటా పచ్చడికి అన్నీ సిద్ధం చేసుకున్నాలే..!' అంటూ మురిసిపోతూ అన్నం టిఫెను అందించింది లచ్చమ్మ.
'ఇందులో నేను సంతోషపడేదేముందే.. ఆడొస్తానని ఫోను చేసినకాడి నుంచి నీ వాలకం చూస్తానే ఉన్నా.. కాళ్లూ చేతులూ ఆడకుండా.. ఏ పనీ తెమలకుండా తెగ తిరగాడుతున్నావు..' అన్నాడు రంగయ్య.

'హుఊ...!' అంటూ మూతి తిప్పుకుంటూ ఎడమచేత్తో పైట సరిజేసి, కుడిచేత్తో బిగిలాగి నడుములో చెంగును దోపుకుంది లచ్చమ్మ.
ముసిముసిగా నవ్వుకుంటూ.. కండవా తలకు చుట్టుకుంటూ.. మీసం మీద చేత్తో ఓసారి సవరదీసుకుని, కొడవలి సైకిల్‌ హ్యాండిల్‌కు మధ్యలో పెట్టి, అన్నం క్యాను కుడివైపు హ్యాండిల్‌కి తగిలించుకొని, పొలం వెళ్లాడు రంగయ్య.
లచ్చమ్మ కూడా రోజూ రంగయ్యతోటే పొలం పోయేది.

వరకట్న సమస్యపై వందేళ్ళ క్రితమే రంగస్థల చర్చ

డాక్టర్‌ జోశ్యుల కృష్ణబాబు
98664 54340

ప్రఖ్యాత నాటక రచయిత కాళ్ళకూరి నారాయణరావు 28-4-1871న పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యపురిలో పుట్టి కాకినాడలో పెరిగి 27-6-1927న సిద్ధాంతంలో నిర్యాణం చెందారు. వీరు కవి, నాటక రచయిత, నటుడు, దర్శకుడు, పాత్రికేయుడు, అవధాని, మంచి ఫోటో గ్రాఫర్‌. అన్నిటికీ మించి గొప్ప సంఘ సంస్కర్త. వరకట్నం తీసుకోలేదు. కళావంతుల యువతిని వివాహం చేసుకొన్నారు. బాల వితంతువైన తన సోదరి గంటాలమ్మకు పునర్వివాహం చెయ్యమని తండ్రితో గొడవపడ్డారు. ఆయన అంగీకరించకపోవటంతో అలిగి ఇంటినుంచి వెళ్ళి పోయారు.

చచ్చేంత ప్రేమ

హిందీ మూలం : రాధేశ్యామ్‌ భారతీయ
అనువాదం : డా. వెన్నా వల్లభరావు

''నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా?'' గదిలోకి అడుగు పెట్టగానే ఆ వ్యక్తి వేసిన మొదట ప్రశ్నే అది.
''నీకు ఏ పని చెయ్యమని డబ్బిచ్చానో, అది పూర్తిచేసి వచ్చావా లేదా?'' టేబుల్‌ ముందు కూర్చున్న యువకుడు కరుకు స్వరంతో కోపంగా అడిగాడు.
''ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు''
''సమాధానం చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. నీకు డబ్బిచ్చింది నేను. అందువల్ల ప్రశ్న వేసే హక్కు నాకే ఉంది'' కోపంతో నాలిక మడత వేశాడు యువకుడు.
''ఇదిగో నువ్విచ్చిన వెధవ డబ్బు'' జేబులో నుంచి నోట్ల కట్ట తీసి టేబుల్‌ పైకి విసిరి కొట్టాడు ఆ వ్యక్తి.
''అంటే, నువ్వు ఇచ్చిన మాట తప్పుతున్నావా?''
''అలా అని నేను అనలేదే! చేస్తాను, కానీ నేను వేసిన ప్రశ్నకి నీ సమాధానం తెలుసుకున్న తర్వాత.''

బుచ్చిబాబు కథలు - భాష

కె.ఉషాబాల
'కథ'ను రసవత్తరంగా ఎలా రాయాలి? మంచి కథ అంటే ఏమిటి? ఈ అంశాలు కథా రచన ప్రారంభంలో బహుశా ఏ రచయిత తనను తాను చర్చించుకోడు. క్రమేపి కధా రచనలో అనుభవం, అనుభూతి, గాఢత వంటివి ఏర్పరుచుకొని వస్తువు, నేపథ్యం, పాత్రలు, అనుభవాలు, అనుభూతి వంటి వాటిని అర్ధం చేసుకుంటాడు. ఓ గొప్ప ఆలోచనలో కథను ప్రారంభించాలని అనుకొన్నా, చివరకు అది పేలవంగా తయారవచ్చు కారణం - ఆలోచనలోని బలం, సాంద్రత 'కథా గమనం'కు ఉపయోగపడే పాత్రలు, నేపథ్యం, వస్తువు, భాష వంటి వాటి వద్ద తేలిపోతాయి. ఎందరో ప్రసిద్ధులు ఒక ఆలోచనకు సంవత్సరాల తరబడి 'చిత్రిక' పట్టి కథారూపంగా తీర్చిదిద్దిన సంఘటనలున్నాయి. కథగా ప్రారంభమైంది 'నవల'గా మారిన సందర్భాలు ఉన్నాయి. రా.వి.శాస్త్రి గారి 'మూడు కథల బంగారం' 'ఇల్లు' వంటివి ఇందుకు ఉదాహరణ. పూర్వ కవులు, పాశ్చాత్యులు కూడా కథలను కావ్యాలుగా తీర్చిదిద్దే కృషి చేసారు. చెకోవ్‌, ఓహెన్రీ, మొపాసా వంటి వారి కథలు ఇందుకు ఓ గొప్ప ఉదాహరణ. వారి కథల్లో 'మెరుపులు' ఎలా సాధ్యమయ్యాయి? కాష్కా కథల్లోని 'గాఢత' ఎక్కువ మందికి అర్ధం కాదు. 'అబ్సర్డిటీ' గా పెర్కొనవారు ఉన్నారు. కారణం - పాత్రలు వాటి మధ్య ఓ 'అంతు చిక్కని లోతైన' ఆలోచనా విధానం, భాష వంటివి ఇందుకు ప్రత్యేకంగా చెప్పకోవచ్చు. అనుభవాలు, అనుభూతులుకు తగిన భాగస్వాయ్య అవసరం. మామ్‌, శరత్‌, చలం వంటి వారి పాత్రలు - వాటి భాషలను పరిశీలిస్తే 'ఒక స్థాయి' లో ఉంటాయి. వారి కథా వస్తులు తగిన పాత్రలతోనే ఈ 'విశేషం' సాధించారు. అసలు ఏ భాషా ఎటువంటి భాష అనేది సమస్య కాదు.

కూలి రోగులు

వి.రెడ్డెప్ప రెడ్డి
94400 44922

పాటూరుకు వెళ్ళే పల్లెవెలుగు నైట్‌ హాల్టు బస్సు బస్టాండులో ఆగంగానే, తూర్పుపఠానికి భయపడి సర్రుమని బిలాల్లోకి దూరి పోయే రెయిమేత గువ్వల్లా తోసుకుంటూ, తొక్కుకుంటూ, కసురుకుంటూ, అరుచుకుంటూ బస్సులోకి దూరడం, దూకడం ప్రయాణీకుల అలవాటు. ఎవరికి వారు కర్చీప్‌, టవల్‌, బ్యాగు ఏది అందుబాటులో ఉంటే అది వేసి సీట్లు రిజర్వు అనడం, వాటిని పక్కకు తోసేసి ముందుగా బస్సెక్కిన వాళ్ళు సీట్లు ఆక్రమిం చుకోవడం కూడా అలవాటే. అలాంటిది ఆ రోజు ఒక్కొక్కరు ఒకో సీట్లో కూర్చున్నా బస్సులో ఇంకా సీట్లు మిగిలి ఉండటం దోణప్పకు ఆశ్చర్యం కలిగించింది. చిన్నపుడు వాళ్ళ నాన్న అడిగిన, 'యెన్నుకొగటి కూసుంటే వొగ గువ్వ మిగుల్తుంది, రెండేసి కూసుం టే వొగ యెన్ను మిగుల్తుంది, చేన్లో గువ్వలెన్నో, యెన్నులెన్నో చెప్పు' ప్రశ్న గుర్తొచ్చింది.

కవులు సమస్యల మూలాల్లోకి చొచ్చుకెళ్లి రాయాలి!

మాడభూషి సంపత్‌ కుమార్‌

ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రం సంచాలకులు
''తెలుగు వెలుగులను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశం మొత్తంకూడా నింపాలనే దీక్షతోనే ఇక్కడ నేను, నా బృందం కతనిశ్చయులమై ఉన అన్నారు ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రం సంచాలకులు, విశ్రాంత ఆచార్యులు మాడభూషి సంపత్‌కుమార్‌. కవి, రచయిత డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య 'సాహిత్య ప్రస్థానం' తరఫున ఆయనతో ముచ్చటించారు. ఆ ముఖా-ముఖి ఇదీ...
మొదటగా మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి ...

అక్షరాల సాక్షిగా తరగతి గది ఆవిష్కారం

పిల్లా తిరుపతిరావు
70951 84846

బాల సుధాకరమౌళి .. ఒక సామాజిక ఉపాధ్యాయుడు. నేడు సమాజంలో ఉపాధ్యాయులు అనేక రకాలుగా కనబడతారు. ఒక చట్రంలో బిగించబడి పాఠశాల విధులకు పరిమితమయ్యే వారు కొందరైతే, ప్రాపంచిక దృక్పథంతో బోధనను బాధ్యతగా భావించేవారు మరికొందరు. మౌళి రెండో కోవకు చెందుతారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోనే సరిపెట్టుకోరు. బోధనకు ఆవల ఉన్న సామాజిక బాధ్యతను గుర్తెరిగినవారు. ఆ బాధ్యతను పిల్లలు ఎత్తుకునేలా చేస్తారు. ఉపాధ్యాయునికి పుస్తక పఠనం అనివార్యమని నమ్మే వ్యక్తి. చారిత్రక అంశాలతో పాటు వర్తమాన విషయాలను ఆకళింపు చేసుకునేలా ప్రతి ఉపాధ్యాయుడూ ఉండాలి.

వివక్షపై గళమెత్తిన కలం గుర్రం జాషువా

డాక్టర్‌ డి.ఉదయకుమారి
అసోసియేట్‌ ప్రొఫెసర్‌
ద్రావిడ విశ్వవిద్యాలయం
కుప్పం - 517 426

కవులు కవిత్వం వెంట నడుస్తారు. కానీ కవిత్వం మహాకవుల వెంట నడుస్తుంది. కవులు అంతటా ఉంటారు. మహాకవులు అరుదుగా ఉంటారు. మహా కవుల కవిత్వం ఆపాత మధురమై, అనుభూతిసిద్ధమై, అవ్యక్త ఆనందాన్ని అందిస్తుంది. స్ఫూర్తిదాయకమై ఉంటుంది. తన కలం బలంతో కులాన్ని కూకటివేళ్ళతో పెకలించడానికి ప్రయత్నించిన జాషువా నిస్సందేహంగా మహాకవి. కఠినమైన జీవితం, కఠోరమైన సాధన, కవితా వధూటి వరించి ప్రసాదించిన సహజమైన ప్రజ్ఞ కలగలసింది జాషువా కవిత్వం.

మైసూరు పర్యటన 3

డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌
94407 32392

మా హిందూపురానికి అప్పటి జిల్లా కేంద్రమైన అనంతపురానికి మధ్యా వాతావరణంలోనే కాదు, తిండి పదార్థాలు లభించే తీరులో కూడా ఎంతో తేడా వుంటుంది! అనంతపురం నుంచి బెంగుళూరు వెళ్ళే దారిలో, పెనుకొండ తరువాత హైవే మీద సోమందేపల్లి ముందు ఎడమవైపు డౌన్‌కు తారురోడ్డు తిరుగుతుంది. అక్కడ నుంచే వాతావరణంలో తేడా అంటే ఒకటి రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడం అనేది పెద్దలు చెప్పడమే కాదు, నాకూ అనుభవమే! అనంతపురంలో దొరకని రీతిలో హిందూపురం హౌటళ్ళలో టిఫిన్లు, చిరుతిళ్లు లభిస్తాయి. ఇది బెంగుళూరు వైపు నుంచి హిందూపూర్‌ వైపుకు ప్రాకిన తిండి సంస్క ృతి అని నా అవగాహన మేర భావిస్తున్నాను.

నాటక కళా దర్పణం - గుంటూరు కళా పరిషత్‌

చెరుకూరి సత్యనారాయణ
తెలుగు నాటక కళ అంతరించిపోతుందనే వాదుకు భిన్నంగా పాత గుంటూరు జిల్లాలో అనేక నాటక ప్రదర్శనా సంస్థలు పనిచేస్తున్న విషయం నాటకం పట్ల ఆసక్తి గల పాఠకులకు తెలిసే వుంటుంది. వీటిలో గుంటూరు కళా పరిషత్‌ (గుంటూరు), పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవాలు (ఎడ్లపాడు), కొండవీటి కళా పరిషత్‌ (లింగారావుపాలెం), పర్చూరి రఘుబాబు స్మారక నాటకోత్సవాలు (పల్లెకోన), ప్రగతి కళా పరిషత్‌ (సత్తెనపల్లి), ఎన్‌.టి.ఆర్‌ కళా పరిషత్‌ (ఒంగోలు), శ్రీకృష్ణ కళా పరిషత్‌ (ఒంగోలు), రంగస్థలి (నర్సరావుపేట), రోటరి అండ్‌ శ్రీకారం కళా పరిషత్‌ (మార్టూరు), కాకతీయ కళా పరిషత్‌ (నాగభైరుపాలెం), కర్షక కళా పరిషత్‌ (గణేశునిపాలెం), చిలకలూరిపేట కళా పరిషత్‌, లావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్‌ (వరగాని), కళల కాణాచి (తెనాలి), కోన ప్రభాకరరావు కళా పరిషత్‌ (బాపట్ల), రంగస్థలి (తెనాలి) లాంటి సంస్థలు ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహిస్తుండగా మరికొన్ని వివిధ కారణాల వల్ల ఆగిపోయా యి. కాగా ఉభయ ప్రజా నాట్యమండలుల శాఖలు రాష్ట్ర వ్యాపితంగా అప్పుడప్పుడు వరుస నాటకాలు నిర్వహిస్తున్నాయి.