జననం : 29 సెప్టెంబరు 1941 మరణం : 17 ఏప్రిల్ 2023
ఐదు దశాబ్దాలుగా తెలుగు పత్రికలను, పుస్తకాలను తన అందమైన రేఖాచిత్రాలతో సౌందర్యవంతం చేసిన చిత్రకారుడు బాలి. ఆయన అసలు పేరు మేడిశెట్టి శంకరరావు. దేశవిదేశాల్లోని తెలుగువాళ్లకు, గీతల్ని, రాతల్ని ప్రేమించేవారికీ బాలిగానే ఆయన సుపరిచితం. లక్షల చిత్రాలు గీసిన లక్షణమైన చిత్రకారునిగా, కార్టూనిస్టుగా, కథారచయితగా తన జీవితాన్నే చిత్రంగా మలచుకున్న కళాకారుడు బాలి. విద్యార్థి దశలోనే 1958 నాటి ఆంధ్ర (వార) పత్రికలో 'ఉబుసుపోక' అనే శీర్షికతో వేసింది తొలి చిత్రమైనా, 1970 నుంచే విస్తారంగా చిత్రాలు గీస్తున్నారు. అమ్మ అన్నపూర్ణమ్మ అందంగా తీర్చిదిద్దే ముగ్గుల్ని చూసి చిత్రకళా సాధనకు ఉపక్రమించిన 'బాలి' ఏ గురువు దగ్గరా శిక్షణ పొందకుండానే స్వయంకషితో ఎదిగారు.
బాలి స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి. అమ్మ అన్నపూర్ణమ్మ, నాన్న లక్ష్మణరావు. అప్పటి బ్రిటీష్ పాలనలో ఆర్మీలో తండ్రి సుబేదార్గా ఉండేవారు. ఉద్యోగరీత్యా సింగపూర్, ఇటలీ, మలయా తదితర దేశాలు తిరిగేవారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో అమ్మే ధైర్యం చెప్పేది. తండ్రి మరణంతో అనకాపల్లిలోని మామయ్య ఇంటికి చేరారు. అక్కడే బాలి చదువు మొదలయ్యింది. బాలి తండ్రి కూడా చిత్రకారుడే! ఆయన చనిపోయిన తర్వాత కానీ, ఆ విషయం తెలియదు ఇంట్లో వారికి. తండ్రికి సంబంధించిన పెట్టెల్ని బ్రిటీష్ అధికారులు పంపితే- పన్నెండేళ్ల తర్వాత తెరిచి చూస్తే డబ్బు, ఇతర వస్తువులతోపాటు, బొమ్మలేయడానికి ఉపయోగించే చైనా రంగుల కేకులు, కుంచెలు, ఆయన చిత్రించిన ప్రకతి దశ్యాలూ కన్పించాయి. ఈ ల్యాండ్స్కేప్లు బాలిలో చిత్రకారుడికి బీజం వేశాయి.
తల్లి అన్నపూర్ణమ్మ ఎంతో అందంగా ముగ్గుల్ని తీర్చిదిద్దడాన్ని బాలి చిన్నప్పటి నుంచీ మక్కువతో చూసేవాడు. అదే తన చిత్రకళకు ప్రేరణ అనేవారు ఆయన. ''నేను వేసిన బొమ్మల్ని మా టీచర్లు అంతగా మెచ్చుకోకపోయినా అమ్మ మాత్రం వాటిలో లోపాలను సరిద్దుతూ మురిపెంగా చూసేది. అమ్మ పడుకున్నప్పుడు వెనుకనుంచి చూసి ఆ భంగిమనే చిత్రంగా గీశాను. ఇప్పటికీ మహిళల చిత్రాలు గీసేటప్పుడు నాకు తెలియకుండానే అమ్మ గుర్తొచ్చి, ఆ ప్రభావం చిత్రాల్లో కన్పిస్తుంటుంది.'' అని గతంలో ప్రజాశక్తికిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు బాలి.
''చదువుతో పాటు చిత్రకళాభ్యాసం చేస్తూనే ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. కుటుంబ పోషణకు ఉద్యోగాల వేట మొదలుపెట్టాను. ఆ సమయంలో చిత్రకళా సాధనని కొంచెం పక్కన పెట్టాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి, పబ్లిక్ వర్క్స్ విభాగంలో క్లర్క్ ఉద్యోగంలో చేరాను. అయితే బొమ్మలు గీయడం ప్రాక్టీస్ మళ్లీ ఎక్కువైంది. పత్రికల్లోనూ నేను గీసిన చిత్రాలు వస్తుండేవి. 1970లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఒక పిల్లల నవల రాసి, దానికి బొమ్మలు కూడా నేనే గీసి పంపించాను. అప్పటి ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్యశర్మ దానిని పత్రికలో సీరియల్గా ప్రచురించడమే కాకుండా.. తనను కలవాల్సిందిగా కబురుపెట్టారు. అక్కడ కెరీర్ బాగుంటుందని భావించి, ప్రభుత్వోద్యోగాన్ని వదిలేశాను.
ఆంధ్రజ్యోతి వారపత్రిక, యువ, జ్యోతి మాసపత్రికల్లో రకరకాల కథలకు నా చిత్రాలు ఎక్కువగా వచ్చేవి. అయితే వత్తిలో మాత్రం స్థిరపడలేదు. ఈలోగా ఈనాడు పత్రిక ప్రారంభమై, అందులో నన్ను స్టాఫ్ ఆర్టిస్టు/ కార్టూనిస్టుగా తీసుకున్నారు. అయితే, ఏడాదిన్నరకే బయటకు వచ్చేశాను. వెంటనే ఆంధ్రజ్యోతిలో స్టాఫ్ ఆర్టిస్టుగా అప్పటి ప్రధాన సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు తీసుకున్నారు. ఆ సంస్థలో 12 ఏళ్లు పనిచేశాను.
బొమ్మలు గీసే మొదట్లో దిగువన శంకర్, శంకరరావు అని సంతకం పెట్టేవాడిని. అయితే అప్పటికే బొమ్మలు గీస్తున్న శంకర్లు ఇద్దరున్నారు. దాంతో పురాణం సుబ్రహ్మణ్యశర్మ నాకు 'బాలి' అని నామకరణం చేశారు. నాకూ అది వినూత్నంగా, వైవిధ్యంగా అన్పించింది. అప్పట్నుంచీ నా చిత్రాలకు 'బాలి' అనే పేరే స్థిరపడిపోయింది. నా అసలుపేరు కన్నా ఈ పేరే నన్ను ఎక్కువ ప్రాచుర్యంలో ఉంచుతోంది.''
''కార్టూన్ని ఏ అంశంపై గీయాలో ముందుగా అవగాహన చేసుకుంటాను. నిజానికి బొమ్మ గీయడం, అందులో యాక్షన్ నాకు కొత్తకాదు. దాన్లో ఫన్ పేల్చడంలోనే కష్టమంతా ఉంటుంది. కార్టూన్లో రాసిన మాటలు చక్కగా అందరూ చదివి, ఆహ్లాదంగా నవ్వుకునేలా ఉండాలి. ఇదంతా కొంత వ్యవధిలోనే జరిగిపోవాలి. అలాంటి అంశాలన్నీ దష్టిలో పెట్టుకుని, కార్టూన్లు పుంఖాను పుంఖాలుగా వేశాను. వాటిలో పోయినవి పోగా ఇప్పటికే ఆరేడు కార్టూన్ సంపుటాలు వచ్చాయి.''
బాలి మంచి కథా రచయిత. చాలా సూక్ష్మమైన పరిశీలతో జీవితాన్ని వడపోసిన కథలు 35 వరకూ రాశారు. అవి ఇటీవల కథల సంపుటిగా వెలువడ్డాయి. అలాగే తన ఆత్మకథను 'చిత్రమైన జీవితం' పేరిట రాసుకున్నారు.
బాపు మెచ్చుకున్న సందర్భం
వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు 'బాలి కార్టూన్లు' అచ్చే శారు. దాన్ని హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ ల్లో బాపు చేత ఆవిష్కరింపజేశారు. ఆయన ఆ పుస్తకాన్ని అలవోక గా అటూ ఇటూ తిరగేస్తుంటే బాలి 'దాన్ని కొంచెం ఓపిగ్గా ఒకసారి చూడండి సార్!' అన్నారు. దానికి ఆయన 'బాలీ! మీకు తెలియకపోవచ్చు, నేను మీ బొమ్మల అభిమానిని. ఇదే కాదు కడప రెడ్డిగారి 'కాళిదాస శంగార తిలకం' పుస్తకానికి మీరేసిన బొమ్మలు అద్భుతం' అన్నారు. ఆ కాంప్లిమెంట్కు బాలి ఎంతో సంతోషపడ్డారు.
తన మీద ఏ చిత్రకారుడి ప్రభావమూ లేదని బాలి చెప్పే వారు. ''నేను ఎవర్నీ అనుకరించను. తెలుగులో బాపు దగ్గర్నుంచీ తమిళ, బెంగాలీ ఆర్టిస్టుల బొమ్మలన్నింటినీ గమనించేవాణ్ణి. ఇటు ఇండియన్, అటు ఫారిన్ ఆర్టిస్టుల్లో ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయి. నా వరకు నేనైతే ఒక సంఘటనని తీసుకోవడం, దానిని చిత్రంగా మలచుకోవడం.. నా అనుభవం మీదే ప్రాక్టీస్ చేశాను. అప్పటికప్పుడు కొన్ని వివరాలు, విశేషాలు వెంటనే తట్టవు కనుక.. వాటికి సంబంధించిన ఫొటోలను భద్రపర్చుకుని, ప్రాక్టీస్లో ఉపయోగిస్తాను.'' అని ఒకసారి చెప్పారు.
బాలి బొమ్మల ప్రదర్శనలు చాలాచోట్ల జరిగాయి. అందు కున్న ప్రశంసలూ, సన్మానాలూ, అవార్డులూ చాలానే ఉన్నాయి. గుంటూరు కళాపీఠం 'చిత్రకళా సామ్రాట్' అనే బిరుదిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'హంస' పురస్కారాన్ని అందించింది. న్యూజిల్యాండ్ బైబిల్ సొసైటీ ఆయన బొమ్మలకు ప్రత్యేక ప్రశంసలందించింది. జర్మనీ ప్రాంక్ఫర్డ్లో పర్యావరణంపై బాలి బొమ్మల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇలా ఎన్నో ఉన్నాయి. బాలి భౌతికంగా లేకపోవొచ్చు. ఆయన గీసిన చిత్రాలూ, రాసిన కథలూ తెలుగు సాహిత్య వాకిలిలో ప్రతినిత్యం శోభిస్తూనే ఉంటాయి.
బాలి గారి కుటుంబం
చిత్రకారుడు బాలి జీవన సహచరి ధనలక్ష్మి 2010లో చనిపోయారు. ఆమె లేని లోటు బాలిని తీవ్రంగా వేధించింది. బాలి తన పనిలో తాను ఉంటే ఇంటి విషయాలన్నీ ఆమె చక్కబెట్టు కునేవారు. ''చిత్రకళలోనే కాకుండా ఎన్నో విషయాల్లో నా భార్య ధనలక్ష్మి సహకరించేది. నేను ప్రభుత్వోద్యోగం వదిలి పత్రికల్లోకి వెళ్తున్నానంటే ఏమాత్రం వెనక్కి లాక్కుండా, భవిష్యత్ గురించి భయపెట్టకుండా నాకు ఎంతో అండగా నిలిచింది. ఆమె నాకు దూరం కావడం నేను తేరుకోలేని విషాదమే.'' అని గుర్తు చేసు కునేవారు బాలి.
బాలి దంపతులకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి వైశాలి, అబ్బాయి గోకుల్. ఇద్దరూ ఉద్యోగాల రీత్యా అమెరికాలో ఉన్నారు. కొద్ది నెలల క్రితం గోకుల్ నదీ ప్రమాదంలో తోటి వారిని రక్షించబోయి మృతి చెందాడు. ఈ సంఘటన బాలిని తీవ్రంగా కలిచివేసింది. మానసికంగా బాగా కృంగిపోయారు.