మన ఊరి సోనూసూద్‌

ఉదయమిత్ర
89196 50545
''ఊరంతా
భయంకర దశ్యాలతో
మునిగిపోయిన తర్వాత
అతను నెమ్మదిగా, ప్రశాంతంగా
అంటుకడుతుంటాడు.''
- బాల సుధాకర్‌ మౌళి
ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీద కారు రర్యు న దూసుకుపోతోంది. వర్షం వెలిసి ఎండ కొడుతుండడంతో చెట్లు తలార బోసుకున్నట్లున్నాయి. పేరు తెలువని చెట్లు, భాష తెలువని యాసలో పాడుకుంటూ, ఆదివాసి నాట్యంలాగా, లయబద్ధంగా ఊగుతున్నాయి.
ఙఙఙ
వెనుక సీట్లో మిత్రులు ఇద్దరు ఏవో రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ లోకం వాళ్లది .నేను మెల్లగా డ్రైవర్తో మాటలు కలిపాను
మనం వీళ్లను డ్రైవర్లే అనుకుంటాంగానీ, కడుపునిండా ఎన్నెన్ని కథలో. కదిలిస్తే గాని బయటికి రావు.
''నాయక్‌ ..నీకు సొంతం కారు ఉండేదట కదా .ఎప్పుడైనా లాంగ్‌ టూరు పోతుంటివా ''అన్నాను మాటల్లోకి దింపుతూ.
''ఓ ..మస్తుగా వోయిన సార్‌ .తిరుపతి ,తమిళనాడు, కేరళ, కన్యాకుమారి ఇట్లా మస్తు తిరిగిన సార్‌'' అన్నాడు హుషారుగా కారును పోనిస్తూ.

''అమ్మా.. నువ్వు కన్యాకుమారి దాంక పోయినవా ..'' అన్నాను ఆశ్చర్యంగా
''అవును సార్‌. ఒకసారి పోయిన.'' అన్నాడు క్లుప్తంగా.
''అది సరే. ఇన్ని టూర్లు చేసినావ్‌ కదా. అన్నింటికన్నా నిన్ను బాగాఇబ్బంది పెట్టిన టూర్‌ ఏది?'' నవ్వుతూ అడిగాను.
''కన్యాకుమారి టూర్‌ సార్‌.'' ఠక్కున జవాబు ఇచ్చాడు.
''ఎందుకూ? బాగా దూరం ఉన్నందుకా?''
''కాదు సార్‌. శవాన్ని తీసుక పోయిన.''
ఒక్కసారిగా నాకు దిమ్మతిరిగినట్టయింది.
''శవాన్నా. శవాన్ని తీసుకపోవుడు ఏంది?'' అడిగాను.
వెనుక మా మిత్రులు ఇవేమీ పట్టించుకున్నట్టు లేదు. వాళ్ల లోకంలో వాళ్ళు న్నారు.
''అదంతా పెద్ద కథ సార్‌. నేను హైదరాబాదులో మల్కాజి గిరిలో ఉంటుంటి. ఒక రోజున మా పక్కింటాయన వచ్చి కన్యాకుమారి ట్రిప్పు పోవాలన్నాడు. ఎందుకు, ఏమిటి అని అడగకుండా సరే అన్నాను. బాగా పైసలు వస్తాయని ఆశ వడ్డ.''
''కన్యాకుమారికి ఎందుకు?''
''అదే సార్‌, అసలు కథ. వాళ్ళింట్లో వాళ్ల తండ్రి సావు బతుకులల్ల ఉన్నడంట. వాళ్ళ సొంత ఊరు కన్యా కుమారట. తాను సొంతూరులోనే చావాలనీ, అక్కడనే బొంద పెట్టాలనీ ముసలాయన ఆఖరి కోరికనట.''
''ఓహౌ''
''బయలుదేరేటప్పుడు ముసలాయన మంచిగనే ఉన్నడు సార్‌. మధ్యకు పోయినంక 'ఠప్‌'మన్నడు. మధ్యల వొదిలి రాలేం కదా సార్‌. తప్పనిసరి శవాన్ని తీసుక పోవాల్సి వచ్చింది సార్‌.''
''శవంతో జర్నీ.చేసినవా.. ఏమనిపించలేదా?''
''తొలుత భయమనిపించింది. తర్వాత అలవాటయింది. ఎనక సీట్ల శవాన్ని కూసోబెట్టి, కొడుకు కోడలు చెరో పక్కన పట్టుకుని కూసున్నరు. ముందర నేను బండి నడుపుతున్న. ఎన్క సీట్ల శవమున్నది.''
''ఇంతకూ కొడుకు కోడలు సంగతేంది. మస్తు పరేషాన్‌ అయి ఉంటరు గదా..''
''వాళ్లా.. హూ.. పక్కన శవం పెట్టుకొని ప్రశాంతంగ
ఉన్నరు సార్‌. మధ్యన రెండుసార్లు కారు ఆపి, శవాన్ని సీట్ల కూకుండబెట్టి, ప్రశాంతంగా టిఫిన్లు, ఛాయలు కానిచ్చిన్రు. నన్ను తినమన్నరు గాని నాకు మనసొప్పలే. సొంత తండ్రి చచ్చిపోతే కొడుకుకు ఏ ఫీలింగ్‌ లేదు సార్‌. ఎప్పుడు కన్యా కుమారి చేరుదమా. ఎప్పుడు బొందపెట్టి చేతులు దులుపుకొని, హైదరాబాద్‌ చేరుకుందమా అన్నట్టున్నరు సార్‌''
ఒక కొత్త అనుభవాన్ని, ఒక కొత్త దృశ్యాన్ని, ఒక కొత్త వాస్తవాన్ని అతను నా ముందు పరుస్తున్నాడు. శవాన్ని కార్ల పెట్టుకొని వందలాది మైళ్ళు ప్రయాణం చేయడమా. అందులో అది పరాయి శవం. ఒళ్ళు గగుర్పొడిచే విషయం. ఏదో 'హిచ్‌ కాక్‌' సినిమా చూస్తున్నట్టనిపించింది.
ఙఙఙ
ఎప్పుడో జరిగిన సంఘటన యాది కొచ్చి కలుక్కుమంది. మా మిత్రుడి తండ్రి చనిపోతే, సమయానికి ఎవరు లేకపోవడం తో నేను బాడీని ఆటోలో తీసుకురావాల్సి వచ్చింది.
ఆ సీను తలుచుకుంటే, ఇప్పటికీ భయమేస్తది. ఆటోలో ముందు సీట్లో నేను. వెనుక సీట్లో శవం. ఆ మూడు కిలో మీటర్లు, మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టు అయింది. ఎగుడు దిగుడు గుంతల్లో ఆటో పడుతూ లేస్తూ పోతుంటే, శవమెక్కడ పడిపోతుందోనని విపరీతంగా భయపడి పోయాను.ఆ నిశ్శబ్దం, ఆ చీకటి ఇప్పటికీ నన్ను వెంటాడుతై.
ఇది జరిగి చాలా కాలమైనా, ఇప్పుడు యాది కొస్తే చెమటలు పట్టినట్టు ఉంటది. ఒక్క మూడు కిలోమీటర్లకే నేను అంత టెన్షన్‌ పడితే, ఈ మనిషి ఆరొందల కిలోమీటర్లు శవాన్ని ఎలా తీసుకుపోయి ఉంటాడో.. అంతుబట్టని విషయం. ఈ మనిషిలో ఏదో మతలబు ఉంది.
ఙఙఙ
ముస్లిములు శవపేటికను మోయడం అనేది పుణ్యకార్యంగా భావిస్తారట. హిందువుల్లోనూ కొన్ని కులాల్లో ఆ భావన
ఉంటుంది. ''శవాన్ని మోస్తే పుణ్యమొస్తది రా'' అని మా తాత అంటుండేవాడు.
ఈ నాయక్‌ కూడా అంతేనా. ఇదేదో పుణ్యకార్యంగా భావించి ఉంటాడా.. ఏమో!
ఙఙఙ
''నమ్మబుద్ధి కావడం లేదు'' అన్నాను కిటికీ అద్దంలోంచి బయటికి చూస్తూ.
కారు ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీద నుంచి శంషాబాద్‌ దగ్గర మలుపు తిరిగి, హైవే మీదకి వచ్చింది. కారు నడపడంలో నాయక్‌కు మంచి అనుభవమున్నట్టుంది. ఎటువంటి బెదురు లేకుండా కారు నడుపుతూ, మాతో హుషారుగ మాట్లాడు తున్నాడు.
వెనుక ఉన్న మిత్రులలో కదలిక ఏదో వచ్చినట్టుంది. వాళ్లూ మా సంభాషణలో గొంతు కలిపారు.
''అయ్యో సార్‌. మీరు దీనికే ఆశ్చర్యపోతున్నారు. కరోనా టైంలో ఇతను ఎన్ని సాహసాలు చేసిండో.. చెప్పు నాయక్‌ చెప్పు.'' అన్నాడు ఒక మిత్రుడు. అతడు నాయక్‌కు గురువు కావడం వల్ల కాస్త చొరవగానే ఉంటాడు.
''అవునా'' నేను నోరెళ్ల బెట్టాను.
''అవును సార్‌. ఓ ఇరవై మందిని, కరోనాబారినుండి కాపాడి ఉంటాడు. ఓ పది కరోనా శవాల్ని తన ఆటోల తీసుకొచ్చి బంధువులకు అప్పజెప్పి ఉంటాడు.'' అన్నాడు మా మిత్రుడు కొనసాగింపుగా.
''నిజమా.. నాయక్‌.'' అని ఆశ్చర్యంగా అతని వైపు చూశాను సుమారుగా పాతికేళ్లుంటాయి. బక్క పల్చగా, అతి సామాన్యంగా కనిపించే మనిషి, ఇట్లాంటి అసాధ్యమైన పనులు చేసిండా అనిపించింది.
''అప్పట్లో నాకొక ఆటో ఉండేది సార్‌. ఎవరికైనా కరోనా వస్తే మస్తు భయపడి పోయేవాళ్ళు. సరిగ్గా ఆ సమయంలో మా పెదనాయినకు కరోనా వొచ్చింది. చెట్టంత మనిషి. కరోనా వచ్చి వొంగిపోయిండు. ''నన్నెక్కడికన్నా దవఖానకు తీసుక పోరా'' అన్నడు ఏడ్చుకుంటూ. కరోనా సంగతి తెలిసి మా పెద్దమ్మ రాత్రి రాత్రే, ఆయనను ఇంట్ల ఒక్కడిని ఇడ్సిపెట్టి తల్లిగారింటికి పారిపోయింది. నాకేమో మా పెదనాన్న అంటే పానం నన్ను చిన్నప్పటినుంచి ఎత్తి దించిండు. నన్ను సాది సదివిపిచ్చింది ఆయనే.'' గొంతుగద్గదమైంది. కాసేపు మౌనం.
''తర్వాతేం జరిగింది?''
''నేను నా ఆటో తీసుకొని, మా పెద్దనాన్నను ఆటోలో కూసోబెట్టుకొని, సరాసరి గాంధీ దవఖానకు తీసుకుపోయిన. అక్కడ షరీకు చేయించి, ఏవో కాగితాలు అడిగితే తీసుకురానీకే మల్ల ఇంటికి వొచ్చిన. మరుసటి రోజు పోయేసరికి మనిషి బెడ్‌ మీద లేడు.
''ఏమైంది?''
''తెలువదు సార్‌. మస్తు పరేషానైన. అక్కడ ఇక్కడ దిరిగిన. అక్కడున్న అటెండర్‌లను అడిగితే మార్చురీల చూడమన్నరు. అక్కడ మా పెద నాయినశవమై కనపడ్డడు. ఎవరిని ఏమి అనేటట్టు లేదు. కరోనా కాలం. డాక్టర్‌ని అడిగితే, కరోనా శవాన్ని ఇచ్చేది లేదని చెప్పేసింది. నేను డాక్టరమ్మను బతిమిలాడి బామాలి ఒప్పించి శవాన్ని ఊరికి తీసుకుపోయిన.''
''మరి ఊరి వాళ్ళు ఏమి అనలేదా''
''మస్తు లొల్లి అయ్యింది సార్‌. బాడీని ఊర్లకు తేవొద్దన్నరు. తెస్తే ఊర్లో కెళ్ళి మమ్ములను ఎల్ల గొడుతమన్నరు. చానా కొట్లాటలు అయినయి. ఆఖరికి నలుగురు పోరల్ని పట్టుకొని స్మశాన వాటికల బొందపెట్టినం.''
కరోనా కాలంలో గజగజ వొణికే మనుషుల మధ్యన, భయంలేని ఒక నూతన మానవుడు నా ముందు ఆవిష్కరించ బడుతున్నాడు. ఇతనికి బతుకు పట్ల తీపి లేదా?
''ఆ తరువాత ఏం జరిగింది?''
''ఈ సంగతి చుట్టుపక్కల ఊర్లల్ల తెలిసింది సార్‌. కరోనా సోకిందంటే చాలు. మెల్లగ నాకు ఫోను చేసేటోల్లు. ఫోన్లోనే బతిమి లాడేటోల్లు. ఏడ్చేటోళ్లు. నేను ఆలోచన చేయకుండా వెంటనే ఆటో తీసుకొని ఆ ఊరికి పోయి మనిషిని తెచ్చి దవాఖాన్ల చేరిపిస్తుంటి. బతికితే మనిషిని తెచ్చి అప్పగిస్తుంటి. చనిపోతే శవాన్ని అప్పగిస్తుంటి. శవాన్ని పూడ్సనీకె ఇంట్లో భయపడితే, నేనే నలుగురిని కూడగట్టి, సావు సందం చేస్తుంటి''
''మరి డబ్బులు?''
''ఎంతిస్తే అంత. మనిషి పానం ముఖ్యం కదా సార్‌. నాకా సమయంలో వాళ్ళ ఏడుపు ,వాళ్ళ ఫ్యామిలీ తప్ప మరేమీ కనబడేది కాదు మీరు నమ్మరు గాని, దయ్యం పట్టినట్టే తిరుగుతుంటి. 'ఆటో నాయక్‌' పేరు బాలానగర్‌ మండలంలో అందరికీ తెలిసిపోయింది సార్‌.''
''అది సరే. మీ ఇంట్లో మీ భార్యాపిల్లలు, అమ్మానాన్నలు ఏమి అనేటోళ్లు కాదా''
''అదృష్టం సార్‌. ఏమీ అనేటోళ్లు కాదు. నా భార్య కూడా నన్ను అర్థం చేసుకునే మనిషి దొరికింది. నేను చేస్తున్నది మంచి పని అనే ఉద్దేశంతో అందరూ నాకు సాప్దారి (మద్దతు) ఇచ్చేటోళ్లు.''
''అది సరే. నీకు గాని, నీ కుటుంబ సభ్యులకు గానీ ఎవరికీ కరోనా రాలేదా?''
''దేవుని దయవల్ల ఎవరికి రాలేదు సార్‌. అసలు నేను ఇంట్లో ఉంటే గదా రావడానికి''
''నమ్మ బుద్ధి కావడం లేదు, నాయక్‌.''
''మీకే కాదు సార్‌. చెబితే ఎవరూ నమ్మరు. గప్పాలు కొడుతున్నరనుకుంటరు''
''మరి నువ్వు కరోనా పేషెంట్లను తీసుకుపోయి, వాపసు తెస్తుంటే మీ ఊరు వాళ్ళు లొల్లి పెట్టలేదా''
''అయ్యో సార్‌. మస్తు లొల్లులు అయినయి. నన్ను ఊర్లకు రావద్దన్నరు. వస్తే కాళ్లు ఇరుగగొడతమన్నరు. ఇల్లు ఖాళీ చేయిస్తమని అన్నరు''
''మస్తు అవస్థలు పడ్డట్టున్నావు కదా''
''అవును సార్‌. రాత్రి 11 గంటలకు ఊరు బయట చెట్లల్ల ఆటోను వెట్టి, చెప్పులు చేతుల వట్టుకొని పిల్లిలాగా ఇంటికి వొచ్చెటోడిని. మల్ల తెల్లారుజామున ఎవరు లేవకముందే ఇండ్లకెల్లి బైలెల్లి పోయేటోన్ని''
''నీ మీద కంప్లైంట్‌ చేయలేదా ఎవరు''
''ఎందుకు చేయలేదు సార్‌. మావార్డ్‌ మెంబర్‌, మా బామ్మర్దే నా మీద పోలీస్‌ స్టేషన్లో కంప్లైంట్‌ ఇచ్చిండు. పోలీసులొచ్చి నా ఆటో గుంజుకుపోయి బాలానగర్‌ స్టేషన్లో పెట్టుకున్న.''
''అమ్మా.పోలీస్‌ స్టేషన్‌ దాకా పోయిందన్నమాట సంగతి''
''అవును సార్‌. రెండు మూడు రోజులు, నా ఆటో స్టేషన్‌ లోనే ఉండిపోయింది. ఆ తర్వాత నేను స్టేషన్కు పోయి లొల్లి పెట్టుకున్న. నేను చేసిన తప్పేంది అన్న. మీరు ఆటో గుంజుకొస్తే నా బతుకేట్ల అన్న. అదన్న ఇదన్న. చివరకు స్టేషన్లో ఓ పెద్దాయనకు నేను చేస్తున్న పనినచ్చి, నా మాటలు నచ్చి నా ఆటోను విడిపించి నా చేతిలో పెట్టిండు''
ఙఙఙ
ఆ కాలంలో సోనూసూద్‌ లాంటి సెలబ్రిటీ ల గురించే మీడియా చెప్పుకొచ్చింది కానీ ఇట్లాంటి అనామకులు కూడా కరోనాకాలంల ముందుకు వచ్చారని, మనుషుల్ని ఆదుకున్నా రని ఎక్కడా చెప్పలేదు.
'ఏ అక్షరము రాయదు
ఏ కుంచె బొమ్మ గీయదు''
ఙఙఙ
కారు వేగంతో నా ఆలోచనలు కదులుతున్నాయి .ప్రశ్నలు పుట్టలు పుట్టలుగా వస్తున్నాయి.
''ఎంతమందిని కాపాడినవ్‌ నాయక్‌.''
''ఇరవై మందికి పైననే కాపాడిన సార్‌. ఓ పదిమంది పానాలు పోయినయి. దవాఖాన్ల వరండాలల్ల శవాలను పడేస్తే ఇంటోళ్లు తీసుకుపోవడానికి భయపడేవాళ్లు. మనం దిల్‌ కీరాజా. ఎవరికి భయపడలేదు. వాళ్లను నా ఆటోలనే తెచ్చి ఊర్లకు చేరుస్తుంటి.. ''
''ఆటోల తెచ్చేటప్పుడు ,ఎవరైనా సాయం చేస్తుండి రా.''
''అందరూ భయపడేటోల్లు సార్‌ .బంధువులే దగ్గరికి రాకపోతే వేరేవాల్లు ఎందుకొస్తరు సార్‌ .శవాన్ని ఎనక సీటుకు కట్టేసి నేనే రాత్రిపూట ఆటో నడుపుకుంటూ వచ్చేటోడిని. ''
ఙఙఙ
మాటలకు అందని అనుభూతి. ఒక గొప్ప కవిత చదువు తున్నట్టు, ఒక గొప్ప దశ్యం చూస్తున్నట్టు, ఒక గొప్ప పాట వింటున్నట్టు అనిపించింది. ఇవేవీ పట్టని నాయక్‌, కారు నడిపిస్తూ తన ధోరణిల చెప్పుకుపోతున్నాడు.అతడి ముందు నేను మరుగుజ్జునై పోతున్న భావన.
తల్లిని కొడుకు, కొడుకు తల్లిని, భార్యను భర్త, భర్త భార్యను నమ్మని పాడు కాలం. శవాలు సైతం అనాధ శవాలవుతున్న కాలం. మనిషి తన నీడను చూసి తానే భయపడే కాలం. సర్కారు చేతులెత్తేసి ప్రజల్ని వాళ్లమానానికి వాళ్లను వదిలేసిన కాలం. ఎటు చూసినా ఒక నిస్సహాయ స్థితి. మనిషి కల్లోల సముద్రంలో కొట్టుకుపోతున్న ఒంటరి జీవిలా ఉన్నాడు. అట్లాంటి సమయాన ఏ పుస్తకాలు చదవని పల్లెటూరు మనిషి, తానే ఒక పుస్తకమై పర్చుకొని, మనల్ని చదవమంటున్నాడు.
''విధ్వంసాల మధ్య
నిశ్చల దీపం అతడు''
ఙఙఙ
నాకు కరోనా వచ్చినప్పటికీ దుర్భరస్థితి యాదికొచ్చింది. కరోనా సంగతి తెలిసినంక బంధువులు, స్నేహితులు ఒక్కరొక్కరు మాయమయ్యారు.పలకరించడం కాదు కదా, కనీసం ఫోన్‌ కాల్‌ కరువైంది. ఒక్కసారి మాత్రం ఓ డాక్టరు, ఇద్దరు ఆశా వర్కర్లు మొక్కుబడిగా చూసి వెళ్లారు. తర్వాత పత్తా లేరు.
బంధువుల సంగతి సరే సరి. అన్నీ తెలిసి తెలువనట్లే నటించారు. ఫోన్‌ చేస్తే, ఎక్కడ కరోనా సోకుతుందో అన్నట్లు మిన్నకుండిపోయారు. కొందరైతే ''పోతానేమో''నని ''తనకి ఇష్టం వచ్చిన తిండి పెట్టమని'' ఉచిత సలహాలు ఇచ్చి మరింత భయపెట్టారు. సముద్రంలో నీళ్ల కోసం వెతికినట్టు అందరూ ఉండి ఒంటరినయ్యాను
బంధువులు, స్నేహితులు పరాయి వాళ్ళయిన చోట, నిజ బంధాలను నిర్వచిస్తూ ఇక్కడొక 'ఆత్మబంధువు' పరిచయ మవుతున్నాడు. సాధారణ మానవుల్లో ఒక అసాధారణ మానవుడిని చూస్తున్నాను.
ఙఙఙ
దేశ విభజన సమయంలో, మతాలవారీగా మనుషులు, ఒకరినొకరు నరుక్కు చంపు కుంటున్నప్పుడు, సాధారణ మానవులు సైతం ఎంత మానవీయంగా స్పందిస్తారో, సాదత హసన్‌ మంటో తన కథల్లో గొప్పగా చూపిస్తాడు.
ఇక్కడ నేను ఆ మనిషిని స్వయంగా చూస్తున్నాను .
ఙఙఙ
సంధ్య వేళ.
కారు దాబా దగ్గర ఆగింది. అక్కడి నుంచి అతను తన ఆటోను తీసుకొని తన ఊరికి వెళ్ళిపోతాడట.
దాబాలో అందరూ మాటల్లో మునిగి ఉన్నారు. చల్లగాలి ప్రేమగా నిమిరి పోతోంది. చుట్టుపక్కల పచ్చని గడ్డి, తల్లి మనసులా పరుచుకుని ఉంది. అందమైన సీతాకోకలు తంగేడు కొమ్మల మీద వాలి కొమ్మలకే అందాన్నిస్తున్నాయి.
నేను నాయక్‌ నే గమనిస్తున్నాను. అతడు ఏమి పట్టనట్టు టీ తాగుతూ, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు.
కరోనా భయాన్ని జయించిన మనిషి
మరణ భయాన్ని జయించిన మనిషి
అనుబంధాలకు నిర్వచనం ఇచ్చిన మనిషి
ఆగామి యుగాల అనాది గీతం
అజేయ మానవుని సూక్ష్మ రూపం..
ఙఙఙ
కథ సినిమా లాగ మొదలై, జీవితంలాగ ముగిసింది.
''ఇన్నిన్ని సాహసాలు చేశావు కదా. ఇప్పుడు మీ దోస్తులు కలిస్తే అప్పటి పాత విషయాలు యాది చేస్తరా'' అన్నాను వీడుకోలు తీసుకుంటూ.
''మస్తు యాది చేస్తరు సార్‌. నన్ను మా ఏరియాల 'బాలానగర్‌ సోనూసూద్‌' అంటరు సార్‌'' అన్నాడు ముసి ముసి నవ్వులు నవ్వుతూ.
నిర్మలమైన సెలయేటి నవ్వు. పసిపాప లాంటి నవ్వు
ఙఙఙ
''పొయ్యొస్త సార్‌'' అన్నాడు.
''గొప్పోడివయ్యా'' అంటూ అతడిని మనసారా కౌగిలించు కున్నాను. అతను వెళ్ళిపోయాడు.బాట ఖాళీ అయింది. అయితేనేమి? నా మనసంతా నిండిపోయాడు
''చంద్రుడుతోనే మనం
మనతోనే చంద్రుడు
వెన్నెలెప్పుడు / మాసి పోదు'' అ

అ ఈ కథకు మూలాధారమైన 'దశరథ్‌ నాయక్‌'కు అంకితం.
అ ఈ కవితా చరణాలు బాల సుధాకర్‌ మౌళివి.