శాంతిశ్రీ
83338 18985
'ఏమేవ్.. ఈ రోజు మన నడిపోడు వస్తున్నాడు గందా.. ఆడికి టమాటా పచ్చడంటే ఇష్టంగా.. చెయ్యరాదూ..?! నిన్న చేలో నుండి పచ్చి మిరగాయలు, టమాటాలు తెచ్చానుగా..' కళ్లు ఎగరేస్తూ.. పంచె కొంగు నడుములో దోపుకుంటూ.. సూరిలో కొడవలి చేతిలోకి తీసుకుంటూ.. దాని పదును బటెనవేలుతో రుద్ది చూస్తూ.. చెప్తూనే పొలం పోవడానికి బయటకు అడుగులేస్తున్నాడు రంగయ్య.
'ఏమయ్యో... ఇదిగో అన్నం.. కొడుకొస్తన్నాడని నాకన్నా నువ్వే మా బాగా సంతోషపడుతున్నావనుకుంటా.. ఆర్డర్లు ఏసేస్తున్నావు.. ఆడికిష్టమనీ టమాటా పచ్చడికి అన్నీ సిద్ధం చేసుకున్నాలే..!' అంటూ మురిసిపోతూ అన్నం టిఫెను అందించింది లచ్చమ్మ.
'ఇందులో నేను సంతోషపడేదేముందే.. ఆడొస్తానని ఫోను చేసినకాడి నుంచి నీ వాలకం చూస్తానే ఉన్నా.. కాళ్లూ చేతులూ ఆడకుండా.. ఏ పనీ తెమలకుండా తెగ తిరగాడుతున్నావు..' అన్నాడు రంగయ్య.
'హుఊ...!' అంటూ మూతి తిప్పుకుంటూ ఎడమచేత్తో పైట సరిజేసి, కుడిచేత్తో బిగిలాగి నడుములో చెంగును దోపుకుంది లచ్చమ్మ.
ముసిముసిగా నవ్వుకుంటూ.. కండవా తలకు చుట్టుకుంటూ.. మీసం మీద చేత్తో ఓసారి సవరదీసుకుని, కొడవలి సైకిల్ హ్యాండిల్కు మధ్యలో పెట్టి, అన్నం క్యాను కుడివైపు హ్యాండిల్కి తగిలించుకొని, పొలం వెళ్లాడు రంగయ్య.
లచ్చమ్మ కూడా రోజూ రంగయ్యతోటే పొలం పోయేది.కానీ కొడుకొస్తున్నాడని ఇంటికాడే ఉంది.
'ఏంటి పిన్నాం.. పనికి పోలేదా?' అంటూ ఎదిరింటి వెంకాయమ్మ వచ్చింది.
'మా నడిపోడు వస్తున్నానని నిన్న మాపిటేల ఫోను చేశాడు. ఇంకో గంటలో వస్తాడు.. ఏ ఏలకి ఎక్కాడో.. ఏం తిన్నాడో.. ఆడు వచ్చేసరికి ఇంటికాడ నన్ను ఉండమన్నాడు మీ బాబాయి.. అందుకే ఈ రోజు పోలేదమ్మారు.. !' అంటూనే ా బకెట్తో నీళ్లు తీసుకుని రోలు కడగడం మొదలుపెట్టింది.
'ఏంటి పిన్నాం.. గారెలండుతున్నావా ఏంటి? రోలు కడుగుతున్నావ్..?' అంది వెంకాయమ్మ అక్కడే ఉండి.
'లేదమ్మాయి.. రాత్రి ఇడ్డీకి, అట్టుకీ పిండి రుబ్బి పెట్టాను. ఆడొచ్చాక రెండు రోజులుంటాడుగా.. ఏదో ఒకరోజు వండొచ్చులే గారెలు.. ఇప్పుడు టమాటా పచ్చడి నూరదామని...' అంటూ ఇంట్లో అప్పటికే వేపి పెట్టుకున్న పచ్చి మిరపకాయలు, టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయి, జీలకర్ర, ఉప్పు డబ్బాలు తీసుకుని వచ్చింది. అవన్నీ రోలు దగ్గర ఉంచి, పాత టవల్ ఒకటి రోలు ఎదురుగా ఏర్పాటు చేసుకున్న రాయి మీద వేసుకుని, కూర్చుంది లచ్చమ్మ.
'టిఫినీలోకి చనగపప్పు, కొబ్బిరేసి చట్నీ చెయ్యపోయావా పిన్నాం.. టమాటా పచ్చడికన్నా..' అంది వెంకాయమ్మా.
'ఆడికి నేను చేసే టమాటా పచ్చడంటే మాలావు ఇష్టమమ్మారు.. మా అయ్యకి కూడా టమాటా పచ్చడంటే ఇష్టంగా తినేవాడు.. ఓ ముద్ద ఎక్కువ తినేవాడు ఆ రోజు.. అదే ఈడికి వచ్చినట్టుంది. మీ బాబారు కూడా ''ఆడికి ఇష్టం కదా.. టమాటా పచ్చడి చెయ్యి!'' అని చెప్పిపోయాడు.. ఆడు టమాటా పచ్చడిని, పప్పులెక్క ఏసుకుని, తింటాడమ్మాయి.. టమాటా పచ్చడి చేస్తే.. వెన్నపూస కూడా ఉంది. వేడేడి అన్నంలో వేసుకుని, ఈ పచ్చడేసి కలుపుకుని చానా ఇష్టంగా తింటాడు. వాడొస్తే పంచబక్ష పరమన్నాలేమీ అడగడు.. ఇదొక్కటే వాడడిగేది..!' అంటూ పచ్చి మిరపకాయలు రోట్లో వేసి, ఉప్పు డబ్బాలో ఉప్పు చేత్తో అంజాదుగా తీసి వేసింది. పచ్చడిబండ పెట్టి వాటిని నూరుతూ..
'ఓ ఎంకాయమ్మా.. రెండు రెబ్బలు కరేపాకు ఆ చెట్టుకాడ నుండి కోసుకురావే! తెద్దామనుకుని మర్చిపోయాను..' అంటూ పురమాయించింది.
'అట్టాగే పిన్నాం!' అంటూ వెంకాయమ్మ కరివేపాకు చెట్టుకాడకెళ్లి, గుప్పెడు కోసుకొచ్చింది. నాలుగు రెబ్బలు లచ్చమ్మకిచ్చి, మిగిలింది తను తీసికెళుతూ.. 'మీ చెట్టు కరేపాకు భలే వాసనేస్తది పిన్నాం.. ఇంకే చెట్టుది ఇంత వాసన రాదనుకో..!' అంది వెంకాయమ్మ.
'అది నేను కాపురానికి వచ్చినప్పుడు వేసిన మొక్క. మీ బాబాయి.. ఆ చెట్టు కొమ్మతోనే ఈ పచ్చడిబండ చేయించాడు..!' అంది లచ్చమ్మ.
'అవునా పిన్నాం.. ఈ రోట్లో నూరితే పచ్చడి మాలావు రుచిలే.. ఆ రోలు కూడా ఆనాటిదేనా?' సందేహంగా అడిగింది వెంకాయమ్మ.
'ఈ రోలు కూడా మా అయ్య చేయించాడు నాకోసం..!' అంటూ కొంచెం గర్వంగా చెప్తూ.. టమాటా ముక్కలు వేసి, నూరి, వెల్లుల్లిపాయిని రోటిమీద పెట్టి పచ్చడి బండతో పైపైన ఒక దెబ్బేస్తూ చిదిమిన పాయలోంచి నాలుగైదు గబ్బాలు తీసి రోట్లో వేసి, జీలకర్ర డబ్బా తీసి, చేత్తోనే కొద్దిగా తీసి వేసి, నూరింది. చివరిలో కరివేపాకు రెబ్బల్ని పక్కనే ఉన్న తొట్టిలో నీళ్లల్లో ముంచి, విదిలించి, పమిటకొంగుతో తుడిచి, ఆకులు దూసి వేసింది. ఓసారి పచ్చడిని పైపైన నూరి, చేత్తో తీసి, గిన్నెలోకి తీసి, అవతలకి పెట్టింది. బకెట్లో నీళ్లు పోసి, రోలు, బండా శుభ్రంగా కడిగి, ఆ పక్కనే ఉన్న గోనెపట్టా దానిమీద కప్పింది.
'ఏంటి పిన్నాం.. పట్టా కప్పావు? ఎవరైనా రోట్లో నూరు కోవడానికి వస్తానన్నారా ఏంటి?' ఆసక్తిగా అడిగింది వెంకాయమ్మ.
'ఆటో సుబ్బారావు పెళ్లాం సుబ్బలచ్చిమి లేదూ.. పండు మిరపకాయలు తీసుకుందంట.. తొక్కుకుంటానంది' అంటూ చెంగు దులుపుకుంటూ.. పచ్చడి గిన్నె తీసుకుని లోపలికి వెళ్తూ.. 'కొంచెం ఆ ఉప్పు డబ్బా, జీలకర్ర డబ్బా లోపలికి ఎత్తుకురా అమ్మారు!' అంది లచ్చమ్మ.
అయ్యి తీసుకొచ్చిన వెంకాయమ్మకి, ఒక గిన్నెలోకి కాస్త టమాటా పచ్చడేసి ఇచ్చింది. 'ఎందుకులే పిన్నాం? మీ అబ్బాయికి ఇష్టమన్నావుగా..!' అంటూనే చెయ్యిజాపి, అందుకుంది.
'నీ దుంపతెగ.. ఓ పక్క అందుకుంటూనే.. వద్దు వద్దంటావు.. మరింత నూరాలే.. పట్టికెళ్లు.. ఏం కూరొండావు?' అంటూ ఆరా తీసింది.
'రాత్రి మీ అల్లుడు కోడికూర తెచ్చుకుంటే వండాను పిన్నాం. అది ఈ పూటకి కూడా ఉంది. ఇక రాత్రికి చూడాలి!' అంది వెంకాయమ్మా..
'ఓహో అదా సంగతీ.. అందుకే తీరిగ్గా ఉన్నావు..' అంటూ గిన్నెలు సర్దుతుంది. ఈ లోపు బయట ఆటో సౌండ్ వినిపించింది.
'అబ్బాయి వచ్చినట్టున్నాడు..!' అంటూ ముఖమంతా విప్పార్చుకుంటూ గబగబా బయటకు వచ్చింది లచ్చమ్మ.
కొడుకు శివాను చూడగానే.. చెంగుతో చేతులు తుడుచుకుంటూ.. గబాగబా కొడుకు చెయ్యందుకుని లోపలికి నడుచుకుంటూ వచ్చారు. ఎవరు ఎవర్ని నడిపిస్తున్నారో చూసేవారికి తెలియడం లేదు.
'అయ్యా.. పెయాణం బాగా జరిగిందా? ఆ బాగు ఆడపెట్టి, తొట్టికాడ కాళ్లు కడుక్కుని రా అయ్యా.. పళ్లు తోముకున్నావా? టిఫినీ ఏసేదా? ఇడ్డీలు తింటావా? అట్టులు పోసేదా?' ఒకదాని మీద ఒకటి ప్రశ్నలు అడుగుతూ తాను హడావిడి పడుతూ, కొడుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది లచ్చమ్మ.
'అమ్మా.. బ్రెష్ చెయ్యడం, కాఫీ తాగడం అన్నీ అయ్యాయి..! ఇడ్లీలే తింటాను. నువ్వు ఆ రోట్లో రుబ్బిన పిండితో వేసే ఇడ్లీలు దూదికన్నా మెత్తగా ఉంటాయి.. అవి తిని చాలా రోజులైంది.. !' అన్నాడు.
'రెడీగా ఉంచిన ఇడ్లీ పిండిలోంచి కొద్దిగా పిండి వేరే గిన్నెలోకి తీసుకుని, ఉప్పు కలిపింది లచ్చమ్మ.. ఇడ్లీ పాత్ర తీసి, ఒకసారి కడిగి, ఇడ్లీలు వేసి, పొయ్యిమీద పెట్టి, వెలిగించింది.
కొడుకు కాళ్లు కడుక్కుని వచ్చి, వరండాలో నులక మంచం తీసుకుని ఆరుబయట వేసి, కూర్చున్నాడు. వరండాలో తీగమీద ఉన్న టవల్ తీసి, కొడుక్కి అందిస్తూ.. 'అందరూ బాగున్నారేరా శివా?' అంటూ మంచినీళ్ల చెంబు తెచ్చి ఇచ్చింది.
'అందరూ బాగానే ఉన్నారమ్మా.. మీ కోడలు ఈసారి సంక్రాంతికి వస్తానంది. పిల్లలిద్దరూ నానమ్మా, తాతయ్యని తీసుకునిరా! అన్నారు.' అన్నాడు శివా.
'బాగా మాటలు చెప్తున్నారన్న మాట..!' మురిసిపోతూ అంది లచ్చమ్మ.
అలా కబుర్లు చెప్పుకుంటూ.. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఇద్దరూ పడుకున్నారు.
ఙఙఙ
నాలుగు కావొస్తుంది టైము.
'లచ్చిమ్ పిన్నాం! లచ్చిమ్ పిన్నాం..!' కేకేలేస్తుంది సుబ్బలక్ష్మి. పండు మిరపకాయలు, చింతపండు, ఉప్పుడబ్బా రోటికాడ పెడుతూ.
అప్పుడే ఒక కునుకు తీసిన లచ్చమ్మ.. ఆ అరుపులకు కొడుకు ఎక్కడ లెగుస్తాడో అని.. కంగారుగా లేచి.. 'ఎందుకే అంత పెద్దంగా అరుస్తావు? మెల్లగా పిలవలేవూ..? అబ్బాయి వచ్చాడు బెంగ్లేరు నుంచి.. పడుకున్నాడు.. లెగుత్తాడే' అంటూ బయటకు వచ్చింది.
'అవునా పిన్నాం..? కాసేపాగి రానా మరి పండుమిరగారు తొక్కోవడానికి..' అంది..
'నువ్వు ఈడ తొక్కుకుంటే ఇబ్బందేముంది.. గట్టిగా కేకలేశావని చెప్తున్నానంతే.. నువ్వొక్కదానివే తొక్కుతావా? ఎవర్నన్నా సాయం పిలవపోయావా?' అంది లచ్చమ్మ.
'సాయక్క వస్తానంది..!' అంటూ అన్నీ రోటికాడ సర్దుతోంది సుబ్బలక్ష్మి.
'నీ పెనిమిటి కబురేమైనా తెలిసిందా?' అడిగింది లచ్చమ్మ.
'ఆడు ఏడకెళ్లడు పిన్నాం.. అటు తిరిగి ఇటు తిరిగి ఈడకే వస్తాడు. పనీపాటా చేయడం లేదని మా అమ్మ గటింటగా అడిగినందుకు అలిగి పోయాడుగానీ.. ఆడికి ఎవరు ఎన్ని రోజులు తిండెడతారు?' అంది సుబ్బలక్ష్మి..
'అయినా మీ అమ్మ సరిగ్గానే అన్నదిలే.. ఆడుండి ఉద్దరిస్తున్నాడా ఏంది? పెనిమిటి లేనోళ్లంతా బతకడం లేదా? నీ బతుకు నువ్వు బతకడం లేదా? ఆ పిల్లలు ఓ దారొచ్చేదాక నీకు ఈ రెక్కల కష్టం తప్పదమ్మారు.. వేన్నీళ్లకి చన్నీళ్లన్నట్లు.. ఒకపూటన్నా ఆడు పనికిపోతే.. నువ్వెట్టాగొట్టా సంసారం ఈదుకొస్తావు.. అయినా వివరం తక్కువ సన్నాసి.. ఆడి గురించి మాట్టాడం కూడా దండగే..' అని లచ్చమ్మ అంటుంటే.. అప్పుడే అక్కడికి వచ్చిన సాయమ్మ 'మరి పిల్లలేమంటున్నారు?' అంటూ రోటికి ఆ దరిన పచ్చడి దంచడానికి సర్దుకుని కూర్చుంది.
'అనేదేముంది? ఆరోజే వాళ్ల నాన్నతోనే అన్నారు..' అంది సుబ్బలక్ష్మి.
'ఏమని?' అంటూ లచ్చమ్మ, సాయమ్మ ఒకేసారి అడిగారు.
'ఎల్లవయ్యో.. మమ్మల్నేమన్నా బెదిరిస్తున్నావా? నువ్వు రాకపోయినా మాకేం కాదు.. మా అమ్మ ఉంది చాలు..' అని.
'అదీ చూస్తా..! అంటూ అట్టే పోతం.. వారం దాటింది.. మరో మూడురోజుల్లో వచ్చేస్తాడు పిన్నాం..! పట్టుమని పదిరోజులు కూడా ఉండలేడు..' అంది సుబ్బలక్ష్మి.
వాళ్ల పచ్చడి అవుతా ఉండగా.. కొట్టోళ్ల శివమ్మ వచ్చి.. 'అమ్మాయి మీది అయిపోగానే చెప్పండి.. రోలు కడగమాకండీ.. మీ మావయ్య చింతకాయలు, పండు మిరగాయలు తెచ్చాడు.. తొక్కాలి..!' అంది.
'రెండూ కలిపి తొక్కుతావా అక్కారు?' అంటూ సాయమ్మ అడిగింది.
'అట్టెంట తొక్కుతామే.. నీ తెలివి తెల్లారినట్టే ఉంది.. రెండూ వేర్వేరుగానే తొక్కాలి. చింతకాయలో గింజేరొద్దు..!' అంది లచ్చమ్మ.
అందరూ పడీ పడీ నవ్వారు.
వాళ్లదైపోయేలోపు కొట్టు శివమ్మ తన సరంజామా అంతా తీసుకుని వచ్చింది.
'నాక్కూడా కాసేపు సాయం చేయండమ్మారు.. వెళ్లిపోమాకండీ!' అంటూ ముందు పండు మిరపకాయలు తొక్కడం మొదలుపెట్టింది.
'మీ అమ్మాయి కాపురం ఎట్టా ఉంది శివా!' లచ్చమ్మ అడిగింది.
'ఆ చచ్చినోడు గోర్నమెంటు ఉద్దోగం వస్తదని ఎకరం పొలం కట్నం కింద తీసుకున్నాడా? ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.. ఇంతవరకు ఉద్దోగం లేదు ఏమీ లేదు. పిల్లే షాపుల్లో పనికి పోతోంది పిన్నాం.. అన్నీ అబద్దాలు చెప్పి జేరారు.. మా కర్మ అట్టా కాలింది.. ఏం చేస్తాం.. పిల్లనే ఓపిగ్గా అట్టాగే ఉండమన్నాం..!' అంది శివ.
'అంతేలే.. ఓపిక పట్టాలి.. అయినా పెళ్లికి ముందే అన్నీ జాగర్తగా కనుక్కోవాలమ్మారు.. ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మేట్టు లేదు..' అంటూ తన పనిలోకి వెళ్లిపోయింది లచ్చమ్మ.
కొట్టు శివ తొక్కిన పచ్చళ్లు అన్నీ సర్దుకుని.. రోలు శుభ్రంగా కడిగి, గోనెపట్టా కప్పి 'వెళతన్నాం పిన్నాం..!' అంటూ అందరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లారు.
సాయంత్రం రంగయ్య వస్తూనే బయటే ఉన్న నులకమంచం మీద కూర్చొని, తలకు చుట్టుకున్న కండవా తీసి, మంచంపై మడతేసి దానిమీద కుడిచెయ్యి మడిచి, నడుం వాల్చాడు.
'ఏమయ్యో.. పొయ్యిమీద నీళ్ల కాగు వేశాను. తానం చెయ్యరాదూ.. అబ్బాయి తన సావాసగాళ్లను పలకరియ్యడానికి వెళ్లాడు. ఆడొచ్చేసరికి కాస్త కూకొని ఆ మాటా ఈ మాటా మాటాడొచ్చు.' అంది లచ్చమ్మ..
'చేత్తాలేవే.. కాస్తంత నడుం వాల్చనీ.. ఏ తానం చేత్తేగానీ నీ కొడుకు మాట్టాడ్డా ఏంటి?' అన్నాడు చమత్కారంగా రంగయ్య.
'పరాసకాలేమీ తక్కువలేదు.. ఆడు నాకేనా కొడుకు..? నీకు కాడా? నీ ఇట్టం..' అంటూ కొడుక్కోసం పకోడీలు వేసే పనిలో ఉంది లచ్చమ్మ.
చూస్తుండగానే రెండురోజులు గడిచిపోయాయి. కొడుకు వెళ్లిపోతున్నాడనీ, రెండు కేజీల బియ్యం పోసి, కొబ్బరి బూరెలు, చెక్క పకోడీలు చేసి పంపింది.
ఙఙఙ
రోజులు గడుస్తూ ఉన్నాయి.
కొన్నాళ్లయ్యాక రంగయ్య, లచ్చమ్మ పనులకు వెళ్లలేక ఇంటి దగ్గరే ఉంటున్నారు. గొడ్డుపని కూడా చెయ్యలేక ఉన్న రెండు గేదెల్నీ, ఒక ఆవుని కూడా అమ్మేశాడు రంగయ్య. కొడుకు శివ ఆ ఇల్లు పడగొట్టి, డాబా కడతానన్నాడు. ఇల్లయ్యే వరకూ పక్కనే ఖాళీగా ఉన్న గొడ్డసావిడినే పడేసి, చిన్న ఇల్లు రేకులతో కట్టాడు శివ. అందులో రంగయ్య, లచ్చమ్మ ఉంటున్నారు.
'అరే శివా.. ఆ రోలు మాత్రం మేమున్న ఇంటిదగ్గరే వేయించిరా..!'
'నీకింకేం ఓపికుందమ్మా.. రుబ్బడానికీ.. మిక్సీ, గ్రైండర్ కొన్నాగా..!' అన్నాడు కొడుకు.
'మాటిమాటికీ ఆటిల్లో వేత్తానా ఏంటి? మా ఇద్దరికీ గిద్ద పప్పు ఏసుకుంటే ఎక్కువతక్కువ. అయినా.. ఆ రోలుంటేనే ఎవరన్నా ఇంటి ముందుకు వచ్చిపోతా ఉంటారు.. కాసేపు కూకుంటారు.. ఏదో మా ముసలోళ్లను పలకరిస్తారు.. కాసిన్ని కబుర్లు చెప్తారు.. అది నేను ఈ ఇంట్లో ఉండేవరకూ ఉండాల్సిందేరా! నేను పోయాక మీ ఇట్టం.. ఆ రోలు ఉంచుతారో.. తీసేత్తారో.. ఇప్పుడైతే మనుషుల్ని పిలిపించి అక్కడ పెట్టించు!' అని స్థిరంగా చెప్పింది లచ్చమ్మ.
'అమ్మ అన్న మాట నిజం. మేమంతా రెక్కలచ్చి వెళ్లి పోయినా.. ఇన్నాళ్లూ ఆ రోలు.. దానికోసం వచ్చే మనుషులు.. అమ్మకు మంచి కాలక్షేపం.. ఆమెకలా కాలం గడిచిపోయేది.' అని మనసులో అనుకుంటూ..
పునాదులు తీసేందుకు వచ్చిన కూలోళ్లతోనే రోలును భద్రంగా అమ్మానాన్న ఉన్న ఇంటి దగ్గర, గుమ్మం పక్కనే వేయించాడు.
అక్కడ కూడా రోట్లో నూరుకోవడానికి వచ్చేవారికి వీలుగా ఉండేలా అటూ ఇటూ కూర్చోనేవారికి సిమెంటు రాళ్లు, వాటిపై నాపరాళ్లతో.. ఆపైనా గోనెపట్టాలను మడతేసి సిద్ధం చేసింది లచ్చమ్మ.
ఙఙఙ
ఇప్పుడు లచ్చమ్మ ఇంటికే ఎవరైనా వచ్చేది.. అది పప్పు రుబ్బుకోవడానికైనా.. పచ్చళ్లు రుబ్బుకోవడానికైనా. వాళ్లు వచ్చినప్పుడు వినపడే గాజుల చప్పుళ్లతో పాటు.. వారి మాటలు.. వాళ్లు చెప్పే గాథలు.. కష్టాలు.. సుఖాలు.. అన్నీ కలబోసుకునేవారు. ఇప్పుడు అలా వచ్చేవాళ్లే రంగయ్య, లచ్చమ్మకు గొప్ప కాలక్షేపం.