గాంధీ మెమోరియల్‌లో బాపిరాజు స్మరణ

డా. నాగసూరి వేణుగోపాల్‌
94407 32392
సరిగ్గా పదేళ్ళ క్రితం మే మాసం చివరలో, తేదీ కూడా చెప్పాలంటే 2013 మే 27న మదరాసు ఆకాశవాణిలో నేను, బదిలీ మీద కడప నుంచి వచ్చి చేరాను. మదరాసు ఆకాశ వాణిలో ఉద్యోగం చేస్తానని అసలెప్పుడూ ఊహించలేదు, ఎందు కంటే మొదట్లోనే నాన్‌ తెలుగు ఆకాశవాణిలో మూడేళ్లు చేశాను కనుక ఇతర భాషా ప్రాంతాల్లో రేడియో ఉద్యోగం చేయడం ఇష్టంలేదు. మద్రాసు తెలియని ఊరు కాదు, అప్పటికి పుష్కరం క్రితం ఎం.ఏ. జర్నలిజం పరీక్షల కోసం, అలాగే ఆ కోర్సు సంబంధించిన కాంటాక్ట్‌ ప్రోగ్రామ్స్‌ కోసం వెళ్ళి ఉన్నాను నాలుగు సార్లు! తెలుగు ఆకాశవాణి పురుడు పోసుకుని నోరు తెరిచింది మదరాసులోనే... 1938 జూన్‌ 16నే! అదే తొలి తెలుగు ఆకాశవాణి కేంద్రం. స్వాతంత్య్రం వచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో తొలి ఆకాశవాణి కేంద్రం 1948 డిసెంబరు 1వ తేదీన విజయవాడలో మొదలైంది. అంతవరకు ఉర్దూ ప్రసారాలు ప్రధానంగా చేసే హైదరాబాద్‌లోని 'నైజామ్‌ రేడియో' 1950 ఏప్రిల్‌ 1న తెలుగు ఆకాశవాణిగా పరిణ మించడం చరిత్ర! మద్రాసులో తెలుగు వ్యావహారిక భాషలో పత్రికలు, సినిమాలు పరిణమించిన తరుణంలో ఆకాశవాణి మొదలవ్వడం, మహామహులు ఎందరో ఇందులో ఉద్యోగులు గా, కళాకారులుగా గొప్ప సేవ చేశారు. అటువంటి మద్రాసు ఆకాశవాణిలో తెలుగు విభాగం అధిపతిగా చేసే గొప్ప అవకాశం అది!
మళ్ళీ అనుకోకుండా, ఈ పెళ్ళి సందర్భంగా సరిగ్గా పదేళ్ళకు మదరాసు పోవడమూ దానికి నాలుగు రోజుల క్రితమే నా సహౌద్యోగి, మిత్రురాలు డాక్టర్‌ జయా మహదేవన్‌ మదరాసు ఆకాశవాణి డైరక్టరు కావడం కారణంగా మెరీనా బీచ్‌కు ఎదురుగా ఉండే మద్రాసు ఆకాశవాణికి జూన్‌ 5 మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో వెళ్ళాం. కార్యక్రమాల రూప కల్పనలో, శ్రోతల స్పందనలో నాకు ఉద్యోగిగా చాలా తప్తి నిచ్చిన మదరాసు కేంద్రంలో మళ్ళీ అడుగు పెట్టడమూ, స్టూడియోలు పరామర్శించడమూ డాక్టర్‌ జి. లలిత వంటి సహౌద్యోగినిని అక్కడ కలవడమూ చాలా ఆనందాన్ని చ్చాయి. ఆకాశవాణిలో టి తాగుతుండగానే 'మీకు కారు రెడీగా వుందోచ్‌' అంటూ బాలాంత్రపు శ్రీమతి రామనాథ్‌ ఫోన్‌ చేశారు. ఆవిడ పేరే శ్రీమతి! ఈ హడావుడిలో జయా మహదేవన్‌తో ఫొటో దిగడం అనే ప్రణాళిక గల్లంతయ్యింది.
మదరాసు ఆకాశవాణి అనగానే ఆచంట జానకిరాం. అయ్యగారి వీరభద్రరావు వంటి పేర్లతోబాటు బాలాంత్రపు రజనీకాంతరావు పేరు కూడా గుర్తుకు వస్తుంది. 'రజని'గా పిలువబడే రజనీకాంతరావు అన్న నళినీ కాంతరావు. 'నళిని'గా పేరుమోసిన నళినీ కాంతరావు పండితుడిగా అనువాదకుడిగా సంపాదకుడిగా విశేష ప్రతిభ కనబరిచినా ఆ స్థాయిలో గుర్తింపు రాలేదని నాకు అనిపిస్తూంటుంది. నళినీకాంతరావు గారి అమ్మాయిల్లో శ్రీమతి, లావణ్య గార్లకు సాహిత్య, సంగీత, నత్య కళల పట్ల చాలా అభిరుచి వుంది. అందువల్ల వారిద్దరూ మదరాసులో నేను ఆకాశవాణి బయట తెలుగువారికి చేసిన కార్యక్రమాల్లో స్నేహహస్తం అందించేవారు. ఇంగ్లీషు సాహిత్యం మీద పట్టు ఉన్న శ్రీమతి గారు తెలుగులో కూడా చక్కని రచనలు చేయగలరని పాలగుమ్మి పద్మరాజు గురించిన వ్యాసం చదివి గమనించి ఉన్నాను. కనుక ఆమెతో అడివి బాపిరాజు, యద్దనపూడి సులోచనారాణి గార్ల గురించి చాలా చక్కని వ్యాసాలు ఇటీవల కాలంలో రాయించుకున్నాను.
మదరాసు వస్తున్నాను అనగానే, ''మనం కలుద్దాం మిత్రులతో ఎక్కడో ఓ చోట'' అని శ్రీమతి ప్రతిపాదించి 'రండి కలుసుకుందాం. అఖిల కళా వైభవశ్రీ అడివి బాపిరాజు సంకలనాల సంపాదకులు డా.నాగసూరి వేణుగోపాల్‌ గారిని' అంటూ ఓ పాతికమందికి కుదిరే వెన్యూలో గెట్‌ టు గెదర్‌ని జూన్‌ 5 సోమవారం సాయంత్రానికి ప్లాన్‌ చేశారు. 2023 మార్చిలో 870పై చిలుకు పుటలతో, బాపిరాజు విభిన్న రంగాల కృషిని విశదం చేసే రీతిలో నాలుగైదు తరాల 98 మంది రచయితల విశ్లేషణలతో ఈ గ్రంథం రెండు భాగాలుగా వెలువడింది. మద్రాసు ఆకాశవాణి నుంచి నేరుగా శ్రీమతి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అల్పాహారం కానించి ఆళ్వారు పేటలోనే వుండే సమావేశ స్థలం 'శ్రీనివాస గాంధీ నిలయం' చేరాం. లోపలికి వెళ్ళిన కాసేపటికే, 'ఈ ప్రదేశం ప్రాముఖ్యత తెలుసా? అడివి బాపిరాజుకి, మీకూ ఇష్టమైన అనుబంధం ఈ ప్రాంతంతో వుంది' అంటూ ఆ భవనం ముందు వున్న తులసి బందావనాన్ని చూపించారు. అందులో గాంధీ మహాత్ము డి చితాభస్మాన్ని నిక్షిప్తం చేశారు. అయితే ఈ భవనంలో గాంధీజీ మద్రాసు వచ్చి నప్పుడు ఉన్నారని చెప్పారు. గాంధీజీకి సంబంధించిన మద్రాసులోని నాలుగైదు ముఖ్య స్థలాల్లో ఇదొకటి. దానికి ఆధారాలు వెతికితే లభించలేదు. దాంతో గాంధీజీ గురించి తమిళంలో 'ఆగస్టు 15' అనే విజయవంత మైన పుస్తక రచయిత, ఆకాశవాణి అనౌన్సర్‌ నీలకంఠాన్ని వివరించమని ఫోన్‌ చేసిన తర్వాత ఇటీవల లభించిన సాధికారిక సమాచారమిది.
ఆ భవనంలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థను 1948 నుంచి అంబుజమ్మ అనే స్వాతంత్య్ర సమరయోధ, గాంధేయవాది చాలా ఏళ్ళు నేతృత్వంవహించారు. అంతకుముందు నేను మద్రాసులో ఉద్యోగం చేసినా ఈ ప్రదేశం గురించి నాకు తెలియదు. స్త్రీల హక్కులకోసం ఖాదీ, హిందీ, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, భూదానోద్యమంలో పాల్గొని 'అక్కమ్మ'గా పిలువబడిన అంబుజమ్మకు 1964లో పద్మశ్రీ గౌరవం కూడా లభించింది. దక్షిణభారతదేశంలోనే శాసనసభకు ఎంపికైన తొలి మహిళ, శారదా చట్టం కోసం పోరాడిన తెలుగు యోధురాలు డా|| ముత్తులక్ష్మి రెడ్డి, అంబు జమ్మకి మిత్రురాలు, సహ ఉద్యమ శీలి! అలాగే దివ్యజ్ఞాన సమాజంతో ముడిపడి వున్న మార్గరేట్‌ కజిన్స్‌ కూడా అంబుజమ్మ మిత్రురాలే. 'థర్డ్‌ డిక్టేటర్‌'గా పేరుగాంచిన అంబుజమ్మ కనుకనే చాలా కాలం ఆ స్వచ్ఛంద సంస్థ ద్వారా అవసరమైన వాళ్ళకు గంజి, పాలు, మందులు వంటివి ఉచితంగా పంపిణీ చేసేవారు. ఇప్పుడు ఒక డాన్స్‌ స్కూల్‌ పద్ధతిగా నడవటాన్ని ఆ ప్రాంగణపు శుభ్రతను బట్టి నేను పసిగట్టాను. అంబుజమ్మ గారు టివిఎస్‌ సుందరం బంధువని, ఆమె తన తండ్రి పేరు, గాంధీజీ పేరు కలిపి ఆ భవనానికి 'శ్రీనివాస గాంధీనిలయం' అని నామకరణం చేశారని కూడా తెలిసింది.
స్వాతంత్య్ర సమరయోధుడిగా, కవిగా, గేయకర్తగా, కథా రచయితగా, నవలాకర్తగా, నత్య సంగీత విశారదుడిగా, 'మీజాన్‌' దినపత్రిక సంపాదకుడిగా, తొలి తెలుగు సినిమా కళాదర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ విశేషంగా ప్రదర్శించిన అడివి బాపిరాజు గురించి 870 పైచిలుకు పుటలతో నా రెండు సంకలనాలుగా వచ్చిన సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాతిక మందే వచ్చినా వారిలో శ్రీమతి, లావణ్య గార్లు కాకుండా జిడ్డు కష్ణమూర్తి పరిశోధకులు, రచయిత్రి సరోజినీ ప్రేమ్‌ చంద్‌, గాయని బి.వసంత చెల్లెలు గాయని బి సావిత్రి వంటి చాలా గౌరవించదగ్గ మిత్రులు రావడం విశేషం. ఆ పూట సభలాగా కాకుండా పాతిక మంది కుర్చీలను గుండ్రంగా వేసుకుని బాపిరాజు రచనలను గుర్తు చేసుకున్నాం. ఆ సంకలనంలో వ్యాసాలు ఇచ్చిన మరో ఇద్దరు రచయిత్రులు డాక్టర్‌ రాయదుర్గం విజయలక్ష్మి, డాక్టర్‌ ప్రభల జానకి ఆ సమావేశానికి రాలేకపోవడంలోటే అని చెప్పాలి.
పొట్టి శ్రీరాములు స్మారక కేంద్ర నిర్వాహకుడిగా, ఆయన పుస్తకాలు వెలువరించిన ప్రచురణ కర్తగా పేరుగాంచిన వై.యస్‌.శాస్త్రి కుమారుడు వై రామకష్ణ రావడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. అలాగే నా రచనలు చదివి ఫోన్‌ ద్వారా పరిచయమయిన వయోవద్ధులు, రేణిగుంట ప్రాంతపు వారు, 'కలియుగ దైవం' సినిమా దర్శకులు రోసిరాజు కూడా కుమారుడితో కలిసి వచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా సి.నాగేంద్ర ప్రసాద్‌ గురించి చెప్పుకోవాలి. వీరి నాన్న సి.నరసింహం బ్రిటీషు హయాంలో 16 ఏళ్లు, స్వాతంత్య్ర భారతంలో పాతికేళ్ళు పనిచేసిన ఐఏఎస్‌ ఆఫీసర్‌. మదరాసు కార్పొరేషన్‌లో పనిచేస్తున్నప్పుడు అడయారులోని గాంధీనగర్‌, కస్తూరిబా నగర్‌ కాలనీలను, మైలాపూరులో కాశీనాథుని నాగేశ్వరరావు పార్కును ఏర్పాటు చేసినవారు. ఆయన మా హిందూపురంలో 1935లో మునిసిపల్‌ కమిషనర్‌గా కూడా పనిచేశారు. అలాగే
హౌస్‌పేట, కోయంబత్తూరు, విజయవాడలలో పనిచేయడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో కర్నూలులో రాజధానికి అసరమైన నిర్మాణాలను తక్కువ ఖర్చుతో పటిష్టంగా నిర్మించిన చరిత్ర కూడా వీరిదే. 'మీ అండ్‌ మై టైమ్స్‌' అనే జ్ఞాపకాల సంపుటిని,
'వేర్‌ వురు ఫెయిల్డ్‌' అనే విశ్లేషణా గ్రంథాన్ని వెలువరించిన శ్రీ చల్లగళ్ళ నరసింహం కుమారుడే ఈ నాగేంద్రప్రసాద్‌. తనకన్నా 20 సంవత్సరాల పైచిలుకు చిన్నవాడినయినా నాగేంద్రప్రసాద్‌ నా పట్ల ఎంతో ఆదరంగా, గౌరవంగా వుంటారు.
అలాగే తమిళ ప్రాంతంలో తెలుగు వారిగా గుర్తింపు లేకుండా, ఎంతో చరిత్ర సష్టించిన కొందరు మహానుభావుల గురించి 'దక్షిణాంధ్ర దారిదీపాలు' అనే వ్యాస సంకలనాన్ని ఐదారేళ్ళ క్రితం తీసుకు వచ్చాను. దానికి మిత్రులు పోజుల ముద్దుకష్ణుడు ఎంతో సహకరించారు. వయసుతోపాటు కలిగే అనారోగ్య కారణాలతో ఆయన రాలేదు, కానీ ఆయన శిష్యుడు, నా సమవయస్కుడు మన్ని వెంకటేశ్వర్లు మా సమావేశానికి వచ్చి లోటు తీర్చాడు. మరో విశేషం గురించి కూడా చెప్పాలి. హైదరాబాద్లో దూరదర్శన్‌ తెలుగు ప్రసారాలు ప్రారంభం కావడానికి సంవత్సరం ముందు నాలుగు ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాలు మద్రాసులో మొదలయ్యాయి. ఆకాశవాణి ప్రఖ్యాత గాయని వింజమూరి సీత కుమార్తె సీతారత్నాకర్‌ మద్రాసులో మొదలైన తొలి తెలుగు టీవీ ప్రసారాల ప్రొడ్యూసర్‌. కాగా శ్రీమతి తొలి తెలుగు టెలివిజన్‌ అనౌన్సర్‌ కమ్‌ యాంకర్‌! వీరిద్దరూ ఆరోజు సమావేశానికి రావడం నా అదష్టం. ఇంకా తిరుమల రామచంద్ర కుమార్తె ఆముక్తమాల్యద, ఆకాశవాణి సోదరి జి. లలిత, అనౌన్సర్‌ చారుశ్రీ,, శ్రీనివాస్‌, సంగీతరావు మొదలైన మిత్రులు కూడా వచ్చారు. బాపిరాజు పాటను బి. సావిత్రి గారు పాడటంతో మొదలైన సమావేశం ఆయన బహుముఖ ప్రజ్ఞను కొనియాడుతూ రెండు గంటల వ్యవధిలో తప్తిగా ముగిసింది.
ఈ కార్యక్రమం తర్వాత టి నగర్‌ వచ్చేశాం. టి.నగర్‌ అంటే వాగ్గేయకారులు త్యాగరాజు గుర్తుగా నామకరణమని కొందరు భావిస్తారు, కానీ అది సమాచార లోపంతో వచ్చిన సమస్య. మద్రాసు నగరపు తొలి మేయరుగా 1920 సంవత్సరం నుంచి సేవలందించిన పిట్టి త్యాగరాయం శెట్టి గారిని స్మరిస్తూ గౌరవ సూచకంగా వచ్చిన పేరు అది. 1876లో కనీ వినీ ఎరుగని కరువు సంభవించినపుడు ఈ తెలుగు నాయకుడు సొంత పైకంతో గంజి కేంద్రాలు ఏర్పరిచారు. ఆ ప్రాంతం గంజిదొడ్డిగా, ఆ స్థలంలో కట్టిన ఆసుపత్రి గంజిదొడ్డి ఆసుపత్రిగా పిలువబడ్డాయి. ఆ ఆసుపత్రే నేటి స్టాన్లీ ఆసుపత్రి. 1916లో డా|| టి. ఎమ్‌. నాయర్‌తో కలసి జస్టిస్‌ పార్టీ పెట్టిన వీరు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని తిరస్కరించారు. అటువంటి టి నగర్‌ నేడు చాలా పెద్ద షాపింగ్‌ సెంటర్‌. ప్రఖ్యాతి గాంచిన పానగల్‌ పార్కు ఆ ప్రాంతంలోనే ఉంటుంది. నిజానికి శ్రీకాళహస్తి దాపులో ఉండే ఒకప్పటి సంస్థానం పానగల్లు. ముఖ్యమంత్రిగా సేవలందించిన పానగల్లు రాజా వారి పేరు మీద అక్కడి పార్క్‌కు అలా నామకరణం చేశారు. పెద్ద పెద్ద సినిమా స్టార్ట్స్‌ తొలి రోజుల్లో తిండి, ఇల్లు లేక అలమటించే సమయాల్లో ఆసరా అయ్యింది ఈ పానగల్‌ పార్కేనని చాలా చోట్ల చదివాం. ఈ పార్క్‌ దగ్గర నల్లి కుప్పుస్వామి సిల్క్‌ షాప్‌ ఉంది. వారిది బళ్ళారి నుంచి కంచి మీదుగా మద్రాసు చేరిన తెలుగు కుటుంబం. ఆయన నాకు మిత్రుడు కనుక అటు వెళితే పలకరించి ఆయనతో కాఫీ తాగడం అలవాటు. అలా ఒకసారి కుప్పుస్వామి షాపుకు వెళ్ళినప్పుడు సినీతార వైజయంతిమాల గారిని పరిచయం చేశారు.2016 ఆగస్టు మధ్యలో నేను తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి బదిలీ మీద వచ్చేశాను. అప్పటికి మెట్రో రైలు మద్రాసు మొహం చూడలేదు, కానీ ఇప్పుడుంది. హైదరాబాద్లో గమనించనిది ఓ విషయం అక్కడ తారసపడింది. మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ మెట్రో పిల్లర్లను గమనిస్తే ఒక పిల్లర్‌ రెండు ముఖాలను ఒక యూనిట్‌గా పరిగణించి పెయింటింగ్‌ చిత్రాలు అలంకరించారు. టూ డైమన్షనల్‌గా అదనంగా శోభనిస్తోంది ఈ ప్రయోగం!
అలా జూన్‌ నాలుగవ తేదీ మధ్యాహ్నం మదరాసు చేరిన మేము ఈ కార్యక్రమాలన్నిటినీ ముగించి అలిసిపోయినా ఆనందంగా గడిచిందని భావన చేస్తూ మరుసటి రోజు అంటే 2023 జూన్‌ 6వ తేది ఉదయం ఎన్ని గంటలకి బయల్దేరాలి, ఎలా వెళ్ళాలి.. వగైరా చర్చించి, లగేజి సర్దేసి నిద్రపోయాం.
(ఇంకావుంది)