చెరుకూరి సత్యనారాయణ
తెలుగు నాటక కళ అంతరించిపోతుందనే వాదుకు భిన్నంగా పాత గుంటూరు జిల్లాలో అనేక నాటక ప్రదర్శనా సంస్థలు పనిచేస్తున్న విషయం నాటకం పట్ల ఆసక్తి గల పాఠకులకు తెలిసే వుంటుంది. వీటిలో గుంటూరు కళా పరిషత్ (గుంటూరు), పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవాలు (ఎడ్లపాడు), కొండవీటి కళా పరిషత్ (లింగారావుపాలెం), పర్చూరి రఘుబాబు స్మారక నాటకోత్సవాలు (పల్లెకోన), ప్రగతి కళా పరిషత్ (సత్తెనపల్లి), ఎన్.టి.ఆర్ కళా పరిషత్ (ఒంగోలు), శ్రీకృష్ణ కళా పరిషత్ (ఒంగోలు), రంగస్థలి (నర్సరావుపేట), రోటరి అండ్ శ్రీకారం కళా పరిషత్ (మార్టూరు), కాకతీయ కళా పరిషత్ (నాగభైరుపాలెం), కర్షక కళా పరిషత్ (గణేశునిపాలెం), చిలకలూరిపేట కళా పరిషత్, లావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ (వరగాని), కళల కాణాచి (తెనాలి), కోన ప్రభాకరరావు కళా పరిషత్ (బాపట్ల), రంగస్థలి (తెనాలి) లాంటి సంస్థలు ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహిస్తుండగా మరికొన్ని వివిధ కారణాల వల్ల ఆగిపోయా యి. కాగా ఉభయ ప్రజా నాట్యమండలుల శాఖలు రాష్ట్ర వ్యాపితంగా అప్పుడప్పుడు వరుస నాటకాలు నిర్వహిస్తున్నాయి.
ఆంధ్ర ప్రజా నాట్యమండలి వారు 1990 నుంచి సప్థర్ హష్మి పేరిట (ూనఉు) వీధి నాటకాలు నిర్వహిస్తున్నారు; అప్పాజోస్యుల, కందాళం ఫౌండేషన్ వారు స్థానిక కళా సంస్థలతో కల్సి ప్రతి సంవత్సర ఒక్కోచోట కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కేవలం హాస్య నాటికలే నిర్వహించే సుమధుర కళా పరిషత్ విజయవాడలో వుంది. జానపద కళా రీతుల్ని ప్రదర్శించే సంస్థ కర్నాటి లకీëనర్సయ్య గారి మృతితో ఆగి పోయింది. గుంటూరు జిల్లాలోనే వినుకొండ, అద్దంకిల్లో కూడా నాటకోత్సవాలు జరుగుతున్నాయి. శాంతారావు, కాళిదాసు, దేవేంద్ర, పద్మారావుల సారధ్యంలో రైతు రాజ్యం, హాలికులూ సేమమా, విషవలయంలో భారతం లాంటి నాటకాలు రైతు సమస్యలపై డజన్ల సంఖ్యలో ప్రదర్శించిన గుంటూరు జిల్లా ప్రజా నాట్యమండలి కూడా ఎక్కువగా ప్రదర్శనలివ్వటం ఆపింది. ఇలాంటి నేపథ్యంలో 25 సంవత్సరాలుగా నాటకోత్సవాలు నిర్వహిస్తున్న గుంటూరు కళా పరిషత్ తన రజతోత్సవం మార్చి 11న నిర్వహించుకోవటమేగాక ఆ సందర్భంలో 'పాకుడురాళ్లు' నాటక ప్రదర్శన ఏర్పాటు చేయటమే గాక 'దర్పణం' పేరుతో ఒక సావనీర్ను వెలువరించింది.
పెద్దపెద్ద సంస్థలు కూడా నిరవధికంగా సాగించలేని నాటక ప్రదర్శనల్ని నలుగురు వామపక్ష సానుభూతిపరులు, నాటకరంగం పట్ల అంకితభావం వున్న మరో నలుగురు కళాభిమానులతో పాతికేళ్లుగా తమ ప్రస్థానాన్ని సాగించిన గుంటూరు కళా పరిషత్ అభినందనార్హం. ఈ సందర్భంగా వారు ప్రదర్శింపజేసిన నాటకం, ప్రచురించిన సావనీర్ పాఠకులకు పరిచయం చేయదగ్గ స్థాయిలో ఉన్నాయి.
ప్రసిద్ద నవలా రచయిత రావూరి భరద్వాజ 1978లో రాసి 2013లో జ్ఞానపీఠ అవార్డు సాధించిన 'పాకుడురాళ్లు' నవల ఆధారంగా తెలుగు ఏమాత్రం రాని నస్రీన్ ఇషాక్ దర్శకత్వంలో సుమారు 40 మంది కళాకారులు ప్రదర్శించిన ఈ నాటకం 110 నిముషాలు నడిచినా కిక్కిరిసిన వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రేక్షకులు మంత్రముగ్దులై కూర్చున్నారు. కథానాయిక మంజరి పాత్రలో 'భావన వాన పందల్' నటన అమోఘం, అనితరం. ఎన్ని అవార్డులకైనా పాత్రం. ఐదు పాత్రల్లో 'ప్రవీణ్ కారికాడు', నాలుగు పాత్రల్లో సంజీవ్ పసల చక్కగా నటించారు. లావణ్య, విష్ణుప్రియ కూడా రెండేసి పాత్రల్లో ఇమిడిపోయారు. నవల దమ్మును మించి నాటకీకరణ ఉంది. 600 పేజీల నవలని 10 యూనిట్లుగా కుదించటమే గాక అంతగా ప్రేక్షకులు లీనమయ్యేట్లు చేసిన దర్శకురాలు నస్రీన్ ఇసాక్, సాంకేతిక సహకారం అందించిన నిపుణులు అభినందనీయులు.
అనేక పాత్రలు, అనేక సంఘటనలు ఉన్న నవలని నాటకంగా మల్చటం, తెలుగు సరిగా రాని భాషేతర యువతీ యువకులతో ఒక్క ఉచ్ఛారణ దోషం లేకుండా నడిపిన దర్శకులురాలు నస్రీన్ మాటలకందని ప్రతిభ కనబరిచారు. ఈమె బొంబాయిలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి పట్టభద్రురాలై అనేక నాటక సంస్థల్లోనూ, విశ్వవిద్యాలయాల్లోనూ పనిచేశారు. అనేక ప్రసిద్ధ ఇంగ్లీషు నాటకాల్ని హిందీలోకి అనువదించి, ప్రదర్శించారు. గతంలో చలం మైదానం నవల్ని కూడా నాటకీకరణ చేసి ప్రదర్శించారు. కాని ఆ విషయం ఎందుకో ప్రచారం కాలేదు.
ఇటీవల కాలంలో గుంటూరు ప్రేక్షకుల్ని ఇంతగా ఆకర్షించిన మరో ప్రదర్శన లేదు. 25 సంవత్సరాల కాలంలో టిక్కెట్లు కొని ప్రదర్శన తిలకించే పద్ధతిని గుంటూరు కళాభిమానులకు అలవర్చటమేగాక ఏ సంవత్సరమూ, ఏ ప్రదర్శనా చెప్పిన సమయానికి నిముషం కూడా తేడా లేకుండా పాటించిన సమయ పాలన, అభినందనీయం. బండ్ల పూర్ణ, నాయుడు గోపి, పెద్దబ్బయ్య, వల్లూరి తాండవ కృష్ణ, అమ్మిశెట్టి శివ తదితర మిత్రులు అభినందనీయులు.
ఇక ప్రముఖ నాటక, కథా రచయిత, అరసం కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, వల్లూరి తాండవకృష్ణల సంపాదకత్వంలో వెలువడిన 'దర్పణం' గురించి చెప్పుకోవాలంటే ఇది తెలుగు నాటక రంగానికి నిజంగా దర్పణమే. నాటకానికి సంబంధించిన వివిధ విషయాలపై రిఫరెన్సు గ్రంథంగా పేర్కొనగల స్థాయి ఇందులో చేర్చిన వ్యాసాలకు, రచయితలకు వుంది. తెలుగు నాటక రంగ చరిత్రకు చెందిన సమస్త విషయాలతోపాటు, నాటక రచయితల, నటుల, నటీమణుల ఛాయా చిత్రాలు సేకరించి ప్రచురించిన సంపాదకుల కృషి ప్రశంసాపాత్రం.
తెలుగు నాటకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు నాటక రంగానికి చెందిన రచయితలు, దర్శకులు, నటులు ఒక్కరిది కూడా లేదనిపించుకోకుండా 253 మంది అరుదైన ఛాయా చిత్రాలతో పాటు మరో 27 ఛాయా చిత్రాలు, వారి సంస్థ పాతికేళ్ల చరిత్రకు సాక్షిగా మరో వంద చిత్రాలతోపాటు అనేక పరిశోధనా వ్యాసాలు సేకరించటంలో వల్లూరి ద్వయం కృషి అనితరం.
నాటకరంగంలో గుంటూరు జిల్లా పాత్రపై బండారు రామస్వామి గారి వ్యాసంలో 1880 నుంచి వివిధ కాలాల్లో పనిచేసిన 53 నాటక సంస్థల వివరాలు సమగ్రంగా పొందుపరిచారు, 'సంస్క ృతి అంటే ఏమిటి?' రావు కృష్ణారావు, 'ఏది ఉత్తమ కళో' సంజీవదేవ్, 'తెలుగు పౌరాణిక నాటకాల' గూర్చి డా|| పి.యస్.ఆర్ అప్పారావు, 'పద్య నాటకాల' గూర్చి పాతూరి శ్రీరామశాస్త్రి 'తెలుగు నాటకరంగం' గూర్చి కూర్మా వేణుగోపాలస్వామి, బాలోత్సవాలపై వి.ఆర్. రాసాని, 'నాటక సాహిత్యం' గూర్చి కొడవటిగంటి, 'తెలుగు నాటకరంగ దర్శకుల'పై వాద్రేవు సుందరరావు వ్యాసాలు దాచుకోదగినవి. ఎపిక్ థియేటర్పైన, కథా నాటికలపైన డా|| కందిమళ్ల సాంబశివరావు రచనలు, కన్యాశల్కంపై ఆచార్య దివాకర్ల వెంకటావధాని, రంగస్థల శిక్షణపై చాట్ల శ్రీరాములు గారి వ్యాసాలు, బాల సాహిత్యం - నాటక ప్రాధాన్యతపై వల్లూరి శిప్రసాద్, ఒపెరాపై మధురాంతకం నరేంద్ర, నాటక పోటీలపై మలిరెడ్డి బాబి, రేడియో నాటకంపై డా|| అనంత పద్మనాభరావుల వ్యాసాలు, శ్రీశ్రీ గారి వ్యాసం ఉన్నాయి. ఇన్ని అపురూపమైన విషయాలు ఒక్కచోట ప్రోది చేసిన ఈ సంకలనం తెలుగు నాటకంపై ఏ మాత్రం ఆసక్తి వున్నా వారైనా దగ్గరుంచుకోవాలి. వీటితోపాటు పాపినేని శివశంకర్ కథ, విశ్వనాధ కవిరాజు నాటిక, పెద్దింటి అశోక్ కుమార్ స్కెచ్, బండ్ల మాధరవావు కవిత, మేడిచర్ల పాట కూడా ఈ సావనీర్లో చేర్చబడ్డాయి. బి.పూర్ణ, సెల్ : 89190 14999 నెంబర్ని సంప్రదించి 1/4 డెమి సైజులో వున్న ఈ 330 పేజీల సావనీర్ని పొందవచ్చు.