డాక్టర్ జోశ్యుల కృష్ణబాబు
98664 54340
ప్రఖ్యాత నాటక రచయిత కాళ్ళకూరి నారాయణరావు 28-4-1871న పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యపురిలో పుట్టి కాకినాడలో పెరిగి 27-6-1927న సిద్ధాంతంలో నిర్యాణం చెందారు. వీరు కవి, నాటక రచయిత, నటుడు, దర్శకుడు, పాత్రికేయుడు, అవధాని, మంచి ఫోటో గ్రాఫర్. అన్నిటికీ మించి గొప్ప సంఘ సంస్కర్త. వరకట్నం తీసుకోలేదు. కళావంతుల యువతిని వివాహం చేసుకొన్నారు. బాల వితంతువైన తన సోదరి గంటాలమ్మకు పునర్వివాహం చెయ్యమని తండ్రితో గొడవపడ్డారు. ఆయన అంగీకరించకపోవటంతో అలిగి ఇంటినుంచి వెళ్ళి పోయారు.
సంఘంలో పేరుకుపోయిన వేశ్యావృత్తిని నిరసిస్తూ 1921లో ఆయన 'చింతామణి' నాటకాన్ని, వరకట్న దురాచారాన్ని నిరసిస్తూ 1923లో వరవిక్రయాన్ని, మద్యపానానికి వ్యతిరేకంగా 1926లో 'మధుసేవ' నాటకాన్ని రాశారు. వరవిక్రయ నాటకానికి ఇది శత జయంతి సంవత్సరం. సంఘంలో వేళ్ళూనుకుపోయిన వరకట్న దురాచారాన్ని పారదోలాలనే తపనతో - అవనిలో ఆడదానిగా పుట్టటమే తాను చేసిన పాపమా? అని ఏ స్త్రీ హృదయమూ ఆక్రోశించకూడదని ఆశించి, ఆడపిల్ల పెళ్లి విషయంలో మగ పెళ్ళి వారి ఆశలు- ఆగడాలు, ఆడ పెళ్ళివారి అవస్థలు ఇలా అన్నిటిని కాళ్ళకూరి నారాయణ రావు ఈ నాటకంలో కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు. ఇది 10 అంకాల నాటకం.
కథావస్తువు : పుణ్యమూర్తుల పురుషోత్తమరావు - భ్రమరాంబ దంపతులకు కాళింది, కమల అనే ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కాళిందికి రజస్వల కాకుండానే వివాహం చెయ్యాలి, లేకపోతే సంఘం వెలివేస్తుందన్న భయంతో పురుషోత్తమరావు తనకు శక్తి లేకపోయినా సింగరాజు లింగరాజు కుమారుడు బసవరాజుకిచ్చి చెయ్యడానికి రూ.5,500 లు కట్నం బేరం కుదుర్చుకొంటాడు. అయితే కట్నమిచ్చి పెళ్ళి చేసుకోవటం ఇష్టంలేని కాళింది నూతిలో పడి ప్రాణత్యాగం చేస్తుంది. పరిస్థితుల ప్రభావంతో రెండవ కుమార్తె కమల ఆ వివాహం చేసుకొని కట్నం కోసం పీడించే పిసినారి మామగారైన సింగరాజు లింగరాజుకు బుద్ధి చెపుతుంది. స్థూలంగా ఇదీ ఇందలి కథ.
వరుల గొంతెమ్మ కోర్కెలు : పురుషోత్తమరావు కాళింది పెళ్ళి కోసం వరాన్వేషణకై కాళ్ళు అరిగేటట్లు కళాశాలలన్నీ తిరుగుతాడు. ఆ వరుల కోరికలెలా ఉన్నాయో చెపుతూ భార్యతో- ఇలా అంటాడు.
నీటైన యింగ్లీషు మోటారు సైకిలు
కొని పెట్టవలెనను కూళ యొకడు
రిస్టువాచియు, గోల్డురింగును బూట్సును
సూట్లుగావలెనను శుంఠయొకడు
బియ్యే బియల్ వరకయ్యెడి ఖర్చు
భరింపవలెననుదరిద్రుడొకడు
భార్యతోడను జెన్నపట్టణంబున నుంచి
చదివింపవలెనను చవటయొకడు
సీమ చదువు చాల సింపిలు నన్నట
కంపవలయుననెడి యజ్ఞుడొకడు
ఇట్లు కొసరు క్రింద నిష్టార్థముల్ వరుల్ దెలుపుచున్న వారు తెల్లముగను'' - అని ఇప్పటి మగపిల్లలకు రూప యౌవన వయో గుణ సంపత్తితో పనిలేదు. దండిగా కట్నం మాత్రం కోరుకొం టున్నారని, అంతలేసి కట్నాలు ఎలా తేవాలో అర్థం కావటం లేదని పురుషోత్తమరావు, భార్యతో చెప్పి బాధపడతారు. పెళ్ళిళ్ళ పేరయ్య 'వరకట్నం' ఎక్కడ పుట్టి, ఎక్కడ పెరిగి, ఎలా విస్తరించిం దో పురుషోత్తమరావుతో చెపుతూ... 'బ్రాహ్మణుల యింట దొలుదొల్త ప్రభవమంది కోమటింటను ముద్దులు గొనుచు బెరిగి కమ్మవారింట ఫెళ్ళున గాపురంబు సేయుచున్నది కట్నంపుచేడె నేడు' అంటాడు.
పరమలోభి, నీచుడు, కట్నం కోసం మూడు పెళ్ళిళ్లు చేసుకొన్న సింగరాజు లింగరాజు యొక్క కొడుకైన బసవరాజుకు, కాళిందినిచ్చి పెళ్ళి చెయ్యాలనుకొంటాడు అమాయకుడైన పురు షోత్తమరావు. సింగరాజు లింగరాజు సంతలో పశువులా తన కొడుకును వేలంలో ఒడ్డుతాడు. పెళ్ళిళ్ల పేరయ్య, వివాహాల వీరయ్యల సాయంతో లింగరాజు పురుషోత్తమరావును రెచ్చగొట్టి వేలంపాటలోకి దించుతాడు. పెళ్ళి కుమారునికి అయిదు వేల అయిదు వందల రేటు పలికేదాకా వదలకుండా వేలం పాట పాడిస్తాడు. మరొకరెవరో ఈ సంబంధానికి పోటీ పడుతోన్నట్లుగా దొంగవేలం పాట పెడతాడు. ఇది తెలియని పురుషోత్తమరావు తన సర్వస్వాన్నీ వేలంపాటలో పెట్టి వరుడిని కొంటాడు. ఈ విషయమంతా తల్లిదండ్రుల సంభాషణల ద్వారా విన్న కాళింది ఎంతో బాధపడుతూ తల్లితో ఇలా అంటుంది.
''మీకు కులము లేద? మాకు రూపము లేద?
ఇంత దైన్యమునకు హేతువేమి..
కట్నమిచ్చి వరుని గడియించికొను కంటె
చిన్నతనము వేరెయున్నదమ్మ..!''
కట్నమిచ్చి పెళ్ళి చేసుకోవటానికి ఆమె అంతరాత్మ అంగీకరిం చదు. కట్నమివ్వటం కోసం తల్లిదండ్రులు పడే అవస్థ, అభిమానా న్ని చంపుకొని కట్నమిచ్చి వివాహం చేసుకోవాల్సిన దుస్థితి ఆమె హృదయాన్ని కలచివేసాయి. అందుకే ఒక స్థిర నిశ్చయానికి వచ్చి చెల్లెలు కమలతో ఇలా అంటుంది : ''నాదు ప్రతినంబు వినుము.. ప్రాణములనైన విడిచెదం గాని యడిగిన విత్తమిచ్చి వరుని గొని తెచ్చినట్టి వివాహమునకు సమ్మతింప నారాట్నము సాక్షిగాను'' అంటూ ప్రతిజ్ఞ చేస్తుంది. ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకొంటూ ప్రాణాలు తీసుకొంటుంది. దానికిముందు సంఘ సంస్కర్తలమని చెప్పుకొనేవారికి, పాలకులకు, మగపిల్లలను కన్న తల్లిదండ్రులకు, తన తల్లిదండ్రులకు, చెల్లెలు కమలకు తన ఆవేదనను తెలియజేస్తుంది. చివరకు బావిలో దూకి ప్రాణాలు తీసుకొం టుంది. అయినా, అన్యాయం ఆగిపోలేదు! లింగరాజు తాను తీసుకొన్న కట్నం తిరిగి ఇయ్యాల్సి వస్తుందన్న ఉద్దేశంతో పురు షోత్తమరావు గారి రెండో కూతురు కమలను కోడలిగా తెచ్చు కోవాలని ప్రయత్నిస్తాడు.
అయితే అప్పటికే ఒక కూతురిని పోగొట్టుకొన్న తల్లిదండ్రులు ఈ విషయాన్ని కమల నిర్ణయానికే వదిలి పెడతారు. ఆమె కూడా చిన్న పిల్ల అయినా ఆలోచిస్తుంది. 'నేనీ వివాహం వద్దంటే తల్లిదండ్రులు నన్ను బలవంతం చెయ్యరు. కాని ఇచ్చిన కట్నం మొత్తం తిరిగిరాదు. ఈ పెళ్ళి చేసుకొని పణమునకు దగిన ప్రాయశ్చిత్తము చేయగల్గినచో తల్లిదండ్రులిచ్చిన ద్రవ్యాన్ని వినియోగంలోకి తేవటమేకాక, అక్క ఆశయాన్ని సాధించిన దానిని కూడా అవుతాను.' అనుకుంటుంది. పెళ్లికి అంగీకారం తెలుపు తుంది. 'వివాహమునకు సంబంధించిన ఇతర విషయము లన్నిటిలో తన ఇష్టానుసారమే నడవనియ్యాలని కోరి, తెలివిగా తండ్రి అంగీకారాన్ని పొందుతుంది. ఆమె ఆ వివాహానికి ఒప్పుకొన్నందుకు తండ్రి ...
''ఏండ్లకన్న చాల హెచ్చగుబుద్ధి నీ
కిచ్చి మమ్ము దేల్చేనీశ్వరుండు
అక్క అట్లు చేసినందుల కీవైన
మాకు కనుల యెదుట మనగదమ్మ'' అంటాడు. కట్నమిచ్చి పెళ్ళిచేసుకోవటం ఇష్టంలేని అక్క కాళింది మార్గానికి భిన్నంగా తాను వెళుతున్నందుకు కమల మనసులోనే అక్కకు క్షమాపణ కోరుతుంది. ''పణమునకు తగిన ప్రాయశ్చిత్తం చెయ్యటం కోసమే తానీ నిర్ణయాన్ని తీసుకొన్నానని తెలుపుతుంది. వివాహమయ్యాక కాపురానికి వెళ్ళకుండా నగలతోపాటు పుట్టింట్లోనే ఉండిపోతుంది. లింగరాజు ఆ నగలకోసం ఆమెను కాపురానికి రావాలని కోర్టుకెక్కుతాడు. ఆమె న్యాయస్థానంలో తానే తన భర్తను రూ.5,500లకు కొనుక్కొన్నానని, అందుకని అతడే తన ఇంటికి వచ్చి ఉండాలని ఋజువులతో సహా న్యాయస్థానంలో వాదిస్తుంది. ఇదంతా చూస్తున్న బసవరాజు సిగ్గుతో తండ్రినసహ్యించుకొని, ఆమె వైపు వచ్చేస్తాడు. ఇద్దరం కలిసి ఈ వరకట్న దురాచారాన్ని రూపుమాపుదాం రమ్మని పలికి భర్తతో కలిసి వరకట్న దురాచార నిర్మూలనకై ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది కమల.
సింగరాజు లింగరాజు లోభగుణం : ఈ నాటకంలో సింగరాజు లింగరాజు పాత్ర చాలా విలక్షణమైనది. ఇతడు పరమలోభి. మోసగాడు. డబ్బుకోసం తాను పెక్కు పెళ్ళిళ్ళు చేసుకోవడమేకాదు, కొడుక్కి కూడా అలాగే చెయ్యాలనుకొంటాడు. డబ్బు సంపాదనకెన్ని మార్గాలున్నాయో ఇలా చెపుతాడు : ''పరువు ప్రతిష్ఠయు బాటింపగరాదు. పొట్టకేమియు ఖర్చు పెట్టరాదు. బంధువులే తేర బల్కరింపగరాదు. వేరు విస్తరి యింట వేయరాదు. కష్టజీవుల జూచి కటకట పడరాదు. త్రిప్పక తనయప్పు తీర్చరాదు దారకేనియు పెట్టె తాళమీయగరాదు. వేయికల్లలకేని వెరవరాదు. ఇన్ని విధములు కాపాడకున్న ధనము దక్కనేరదు, ధనముచే దక్కనింట బెత్తనములేదు! బయటను బేరులేదు పలుకుబడిలేదు బ్రతికిన ఫలములేదు''
వెర్రివెంకటాయలు? పత్రికలనియు, బరిశోధనలనియు, సంఘ సంస్కరణలనియు, సహాయ నిరాకరణములనియు, స్వరాజ్యమనియు, చట్టుబండలనియు పనిలేని గొడవలు పయి బెట్టుకొందురు గాని వడ్డీలు పెరుగుటకు వాటమైన సాధన మొక్కరును జూడరంటాడు. సంఘ సంస్కర్తలందరూ ఇతని దృష్టిలో వెర్రివెంగళాయలు, పనిలేని వాళ్ళు. ఇతని దృష్టిలో పెళ్ళికూతురు ఎలాంటి లక్షణాలతో ఉండాలో చూస్తే హాస్యం, ఆశ్చర్యం రెండూ మిళితమౌతాయి. పెళ్ళిళ్ళ పేరయ్య కాళింది అందచందాలు, చదువు సంధ్యల్ని గూర్చి చెపుతూంటే, సరే కాని కన్యకు కావలసి నవి చదువూ చక్కదనమూ కావు, అంటూ ఇలా చెపుతాడు. ''తిండియొక్క ప్రక్క వెలితిగా దినగవలయు చెప్పకయె యింటి పనులెల్ల జేయవలయు. ఊరికే కొట్టినను పడియుండవలయు. ఇట్టి కన్యను వెదకి గ్రహింపవలయు''
లింగరాజు 3వ పెళ్ళి చేసుకొన్న భార్య సుభద్రను ఏమీ సుఖపెట్టడు, తిండి సరిగా పెట్టడు. మంచి బట్టలు కట్టుకోనివ్వడు. అతనితో కాపురం ఎంత కష్టమో చెపుతూ ఆమె చాలా వాపోతుంది.
ఆడపిల్లల తల్లి ఆవేదన : ఇందులో కాళింది, కమలల తల్లి భ్రమరాంబ పాత్ర కూడా గొప్పది. కట్నమిచ్చి పెళ్ళిచేయటం కంటె, నన్ను కొడుకుగా భావించి ఇంట్లోనే పెట్టుకోరాదా? అని కాళింది అన్నప్పుడు 'తల్లీ! అవివాహితయగు ఆడుబిడ్డ ఇంటగలతల్లి అవస్థ నీకిపుడేమి తెలుస్తుంది.
''పెరవారి పిల్లకు వరుడేరు పడెనన్న
మనపిల్ల కెవ్వడో మగడటంచు
పరుల పిల్లల పెండ్లి పరికించునపుడెల్ల
మన పిల్లకెపుడో మనువటంచు
ఎదుటియింటికి నల్లుదేతెంచినపుడెల్ల
మనయల్లుడెపుడింట మసలుననుచు
పొరుగింటి పిల్ల కాపురము విన్నపుడెల్ల
మన పిల్లకెట్టి దబ్బునొ యటంచు
నాడు బిడ్డ జనించుటే యాదిగాను
బుస్తె మెడబడు వరకు మాపులును బవలు గుడుచుచున్నను, గూర్చున్న, గునుకుచున్న దల్లి పడు బాధ తెలుపగ దరమెబిడ్డ?'' అంటూ వాపోతుంది.
కడకు ఆ పెళ్ళి ఇష్టంలేని కాళింది ఆత్మత్యాగం చేసికోగా ఆ తల్లితండ్రుల బాధ వర్ణనాతీతం. పురుషోత్తమరావు భార్యను ఊరడిస్తుంటే ఆమె..
ఎన్నడు నామాట కెదురు చెప్పగలేదు
తండ్రి గీచిన గీటు దాటలేదు
బడియన్న నెన్నడు బ్రాలు మాలగలేదు
రాట్నంబునెడల బరాకు లేదు
అది నాకు గావలెనని యెన్నడనలేదు
కుడుచునప్పుడు గూడ గొడవలేదు
ఆటల యందైన నలుక యెన్నడు లేదు
పొరుగింటికేనియు పోకలేదు
కలికమునకేనియును నోటకల్లలేదు.
మచ్చునకు నేనియుం బొల్లుమాట లేదు.
అట్టిబిడ్డను బ్రతికియున్నంతవరకు
మరువ శక్యమె! వెట్టి బ్రాహ్మణుడ! నాకు..!'' అంటూ బాధతో
తల్లడిల్లి పోతుంది. చివరకు ఆ వివాహం చేసుకోవటానికి కమల మనస్ఫూర్తిగా అంగీకరించినందుకు ఒకింత సాంత్వన చెంది పెళ్ళి సన్నాహాలు ప్రారంభిస్తారు ఆ దంపతులు.
మగపెళ్ళి వారి ఆగడాలు : ఇక పెళ్ళిలో మగపెళ్ళి వారి ఆగడాలు, ఎలా ఉంటాయో ఈ నాటకంలో చాలా సహజంగా, భలే చమత్కారంగా, కళ్ళకు కట్టినట్లుగా వర్ణిస్తారు కాళ్ళకూరి.
''తెల్లవారగనెబిందెలతోడ నీళ్ళును
పలుదోము పుల్లలుబంపవలయు కావిళ్ళతో వెన్క కాఫీయు, దోసెలి
డ్డెనులునుప్మాయు నర్పింపవలయు
తరువాత భోజనార్ధము రండు రండని
పిలిచిన వారినే పిలువ వలయు
కుడుచునప్పుడుపంక్తినడుమనాడుచు
బెండ్లి వారి వాంఛలు కనిపెట్టవలయు
నొకడు రాకున్న వానికై యోర్పుతోడ
మంచినీరైన ముట్టక మాడవలయు
నిన్నిటికి సైచి వేలు వ్యయించి
గౌర వించినను నిష్ఠురములె ప్రాప్తించు దుదకు''
వీటితోపాటు వియ్యపురాలు మర్యాదలు, పెళ్ళివారికి చేయాల్సిన గౌరవాలు, ఎంత కష్టంగా ఉంటాయో వివరించారు. ఆడపెళ్ళి వారికి 16 రోజుల పండగంటే ఏంటో హాస్యాన్ని జోడించి, మరీ చెబుతారు.
వియ్యపురాలి మర్యాదలు : వియ్యపురాలు గారికి తెలివిరాగానే కళ్ళుతుడవాలి, కాళ్ళు మడవాలి. కోక సర్దాలి, కిందకు దింపాలి, పెరట్లోకి పంపాలి, నీళ్ళ చెంబందివ్వాలి, రాగానే కళ్ళు కడగాలి, పండ్లు తోమాలి, మొహం తొలవాలి, నీళ్ళు పొయ్యాలి, వళ్ళు తుడవాలి, తలదువ్వాలి, కొత్త చీర కట్టాలి, కుర్చీ వెయ్యాలి, కూర్చోబెట్టాలి, పారాణి రాయాలి. గంధం పుయ్యాలి, అత్తర్లివ్వాలి, పన్నీరు జల్లాలి, మొహాన్ని మొహిరీలద్దాలి. కళ్ళకు కాసులద్దాలి, వంటిని వరహాలద్దాలి. వెండి పలుపు వెనుకకు కట్టాలి. బంగారు పలుపు పక్కకు చుట్టాలి. దిష్టితియ్యాలి, హారతివ్వాలి, అద్దాన్నమివ్వాలి. ఇట్లాంటి వింకా ఎన్నో ఇవ్వాలి. ఆలస్యమైతే అలకకట్నం చెల్లించవలసి వస్తుంది.' ఘంటయ్య పురుషోత్తమరావుతో వియ్యపురాలు నిద్రలేచే వేళయ్యింది భ్రమరాంబను పంపమంటూ చెప్పిన మాటలివి.
పదహారు రోజుల పండగ అంటే .. : తొలినాడడావిడి, మలినాడయాసం, మూడు మంగళాష్టకాలు, నాలుగు పత్రాలు, అయిదు అప్పగింతలు, ఆరు అంపకాలు, ఏడు వంట బ్రాహ్మల తగవు, ఎనిమిది ఋణదాత నోటీసు, తొమ్మిది జవాబు, పది దావా, పదకొండు స్టేటుమెంట్లు, పన్నెండు విచారణ. పదమూడు డిక్రీ, పద్నాలుగు టమటమా, పదిహేను వేలము, పదహారు చిప్ప. ఈ రోజుల్లో ఇదే పదహారు రోజుల పండుగ. పెళ్ళిళ్ళ పేరయ్య, పురుషోత్తమరావు అవస్థను చూసి ఈ మాటలంటాడు.
కమల వాదనా పటిమ : చివరికి కమల వివాహం లింగరాజు కుమారుడు బసవరాజుతో జరగటం, ఆమె కాపురానికి వెళ్ళకపోవటం, లింగరాజు కోర్టుకెక్కటం జరుగుతుంది. కోర్టులో తన వాదన వినిపించటానికి ముందు తనకు తానే కమల ఇలా ధైర్యాన్ని నూరి పోసుకొంటుంది. ఎంతో తెలివిగా, చాకచక్యంగా కోర్టులో తన వాదనను వినిపిస్తుంది. తాను డబ్బిచ్చి వరుని కొనుక్కొన్నానని, అందుచే అతడే తన ఇంటికి వచ్చి తనకు సేవ చేయాలని న్యాయమూర్తిని కోరుతుంది.
బవవరాజు పశ్చాత్తాపం : బసవరాజుకు ఇదంతా చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. తన తండ్రి కపటబుద్ధి ఇంత చేసినందుకు బాధపడతాడు. న్యాయాధికారి ముందుకు వచ్చి తలదించుకొని ఇలా అంటాడు :
అమ్మెను నన్ను నా జనకుడాయమనన్ గొనె రొక్కమిచ్చి
యీ కొమ్మకు నేను భృత్యుడను గొంకక
యేపని సేయుమన్న నిక్కమ్ముగ జేయువాడ, నిటుకట్నములం/ గొనువారు రూఢిగా
నమ్ముడు కాండ్రుకాక, మగలంటకు నర్హులు
కారు లేశమున్'' అనగానే న్యాయాధికారి సెభాష్! అని మెచ్చుకొంటాడు. కమల-బసవరాజు లిరువురు వరకట్న దురాచారాన్ని రూపుమాపటానికి బయల్దేరతారు.
ఇక దశమాంకమంతా ఇంచుమించు మొత్తం అన్ని పాత్రల చేత వరకట్న దురాచారాన్ని రూపుమాపాలనే ఉద్బోధ చేయిస్తారు కాళ్ళకూరి. బసవరాజు కట్నాలు తీసుకొనే వరులనుద్దేశించి ఇలా ప్రబోధిస్తాడు.
''కట్నాలకై పుస్తకములు జేకొని పాఠ
శాలలకేగెడు చవటలార!
పిలిచి కాళ్ళు కడిగి పిల్ల నిచ్చినవారి
కొంపలమ్మించెడి కుమతులార! అల్కపాన్పుల నెక్కి యవియివి కావలె నని శివమాడెడి యధములార! ఎంత ఎంత పెట్టిన దిని యెప్పటికప్పుడు నిష్టురోక్తులు పల్కునీచులార..!
కట్నమనుపేర నొక చిల్లి గవ్వగొనిన / భార్యకమ్ముడు వోయిన బంటులగుచు జన్మదాస్యంబు సలుపుడు, సలుపకున్న నత్తవారింట గుక్కలై యవతరింత్రు.'' అంటూ హెచ్చరిస్తాడు. సింగరాజు కూడ 'కలడె నావంటి ఖలుడు లోకంబునందు' అంటూ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. అందరూ కలిసి సమాజంలో వరకట్న సమస్య సమసిపోవాలంటూ భరత వాక్యాన్ని పలకటంతో నాటకం ముగుస్తుంది.
అయితే డా.పి.ఎస్.ఆర్. అప్పారావు గారు తమ తెలుగు నాటక వికాసంలో ఈ నాటకంలోని పురుషోత్తమరావు పాత్రను గూర్చి విశ్లేషిస్తూ .. పురుషోత్తమరావు తనకున్నవని చెప్పుకొనే ఆదర్శాల్లో ఒక్కటి కూడా ఆచరణలో నెరవేర్చుకొనే ప్రయత్నం చెయ్యలేదంటారు. ఈ వరవిక్రయ నాటకాన్ని మొట్టమొదట ఆంధ్ర సేవాసంఘం వారు. ప్రదర్శించారు. అనంతరం శ్రీ రాజా మోతే నారాయణరావు గారి సీతారామాంజనేయ నాటక సంఘం వారు చెన్నపట్నంలో అనేకసార్లు ప్రదర్శించి ఎన్నో బహుమతుల్ని పొందారు. ఆ తరువాత అనేక నాటక సమాజాల వారు మద్రాసు నుంచి కలకత్తా వరకు ఎన్నో ప్రదర్శనలనిచ్చారు.
జాతీయోద్యమ ప్రభావం : వరవిక్రయ రచనా కాలం నాటికి యావత్భారత దేశంలో జాతీయోద్యమ స్ఫూర్తి వెల్లివిరుస్తోంది. మహాత్మాగాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ ఉద్యమం, ఖద్దరు ప్రభావం ఉధృత మయింది. అందుకే ఈ నాటకంపై జాతీయోద్యమ ప్రభావం అడుగడుగునా కనిపిస్తుంది. నాటక ప్రారంభంలోనే కాళింది చరఖా తిప్పుతూ, దాని గొప్పదనాన్ని వర్ణిస్తూ ప్రవేశిస్తుం ది. ఆమె తండ్రి పురుషోత్తమరావు కూడా పదేళ్ల నుంచి చేస్తున్న రెవెన్యూ ఇన్స్పెపెక్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంట్లో రాట్నం వడుకుతున్నట్లు కవి చిత్రిస్తారు. 'కాళింది' తాను కట్నం ఇచ్చి వివాహం చేసుకోనంటూ 'రాట్నం'పైనే ప్రమాణం చేస్తుంది. చనిపోయే ముందు రాట్నం వడికి బారెడు నూలు తీసి రాట్నం కలకాలం తిరుగుతూ ఉండాలని కోరుకుంటుంది. ఈవిధంగా నాటకంలో జాతీయోద్యమ ప్రభావం ప్రగాఢంగా కనిపిస్తుంది.
సమకాలిక నాటక కవులపై ప్రభావం : ఈ నాటక ప్రభావంతో ఆ తరువాత మరికొందరు కవులు 'వరవిక్రయం' పేరిట నాటకాలు రాశారు. 1. నాటక సరస్వతి (1925), 2. గరికపాటి కామేశ్వరరావు (1926), 3.చెఱకుపల్లి వేంకట్రామయ్య (1926), 4. అల్లమరాజు నారాయణరావు (1926), 5.ఎఱ్ఱాప్రెగ్గడ సత్యనారాయణమూర్తి (1933).
ఈ రచయితల్లో కొందరు కాళ్లకూరి నాటకంలోని పేర్లను మాత్రం మార్చుకొన్నారు. కామేశ్వరరావు గారైతే చిన్న చిన్న మార్పులు తప్పిస్తే కథాఘట్టాలలోగాని, సన్నివేశాలలోగాని, పాత్ర చిత్రణలోగాని, చివరకు పద్య రచనలోగాని చాలావరకు కాళ్ళకూరి వారినే అనుకరించారు. కాళ్ళకూరి కవితాప్రాభవానికి, పద్యరచనా చమత్క ృతికి ఈ కవులంతా లొంగిపోయారని చెప్పక తప్పదు.
చలన చిత్రంగా వరవిక్రయం : ఈ నాటకం 1939లో సి.పుల్లయ్య గారి దర్శకత్వంలో చలనచిత్రంగా రూపొందించారు. సినిమాలో చాలవరకు సంభాషణలు, పద్యాలు కాళ్ళకూరివే తీసుకొన్నారు. బలిజేపల్లి లక్ష్మీకాంత కవి ఈ చిత్రానికి పాటలు, కొన్ని అదనపు సంభాషణలు రాసారు. ఇందులో సింగరాజు లింగరాజు పాత్రను కూడా బలిజేపల్లే ధరించారు. కాళిందిగా భానుమతి, కమలగా పుష్పవల్లి వేసారు. దయితా గోపాలం - పురుషోత్తమరావుగా, కుచ్చర్లకోట సత్యనారాయణ- బసవరాజుగా, సీనియర్ శ్రీరంజని - భ్రమరాంబగా, దాసరి కోటిరత్నం - సుభద్రగా నటించారు. కొన్ని చలన చిత్రాలపై వర విక్రయ నాటక ప్రభావం కనిపిస్తుంది.