'ఓ మహాత్మా.. ఓ మహర్షి .. ఓ క్షమా పీయూష వర్షీ ..' అని గాంధీజీ శత జయంతికి గీతం రాశాడు శ్రీశ్రీ. గాంధీజీ హంతకుడిలో దేశభక్తిని చూపిస్తూ ఆయన హత్య వెనక వున్న భావజాలాలనూ, వాటికి మూలమైన సంస్థల పేర్లను పాఠ్య పుస్తకాల నుంచి తొలగించిన అఘాయిత్యంపై ఏ కవిత రాసేవారో!
'తాజి విడువలేదు రాజసంబు అని జాషవా రాస్తే.. తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు' అని ప్రశ్నించాడు అదే శ్రీశ్రీ. వాళ్లలో శ్రమజీవులను చూశాడు గాని మతాలను చూడలేదు. కాని ఇప్పుడు తాజ్మహల్, చార్మినార్, జిన్నా టవర్ ... ఏదైనా సరే మతాన్ని చూడమంటున్నారు. మానవత్వం మరవమంటున్నారు. అందుకే ఇది సవాళ్ల సమయం. గత సంచిక సంపాదకీయంలో మేము చిత్ర పరిశ్రమలో మతవాద మలుపు గురించి రాశాం. వర్తమానంలో మలుపును బలపర్చుకోవడానికి గతాన్ని కూడా మతం కోణంలో చూడాలంటున్నారు కేంద్రం పెద్దలు. 'చరిత్ర అడక్కు చెప్పింది విను' అని దబాయిస్తున్నారు. మోడీ ప్రధాని అయ్యాకే చరిత్ర అన్నట్టు వ్యవహరిస్తున్నారు. 'ఇది కాదోరు చరిత్ర సారం' అన్న శ్రీశ్రీ మాటలు మర్చిపోమంటున్నారు.
అంతటితో ఆగుతున్నారా? వినాయకుడికి ఆనాడే ప్లాస్టిక్ సర్జరీ జరిగిందనీ, గాంధారీకి సిజేరియన్ చేసి వందమంది పిల్లలను తీశారని చెబుతున్న అభినవ విజ్ఞానులకు డార్విన్ గిట్టడం లేదు. జీవ పరిణామం వారికి ప్రమాదకరంగా కనిపిస్తున్నది. సిలబస్ తగ్గించాలంటూ ఆ పాఠాలనూ తీసేయాలని ఫర్మానా జారీ చేశారు. చరిత్రనే మార్చిన వారికి కళా సాహిత్యాలపై దాడి ఒక లెక్కా?
గత చరిత్రను అలా వుంచి వర్తమానంలో చూస్తే విశాఖ ఉక్కుపై నాటకం కొనసాగిస్తూనే ఉన్నారు. తెలుగువారి హక్కును హుళక్కి చేస్తామంటున్నారు. అదానీ వంటి అక్రమ కుబేరులకు అభయహస్తమిస్తూ ఛత్రచామరాలతో కాపాడుతున్నారు. మరోవంక ఉద్యోగ కార్మికుల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. మేడే పోరాటంతో సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాన్ని 12 గంటల పనిగా మారుస్తున్నారు. పాదుపు చేసి తీసిపెట్టుకున్న మొత్తాలనూ ఆయనకే కట్టబెట్టారని తెలిసి తెల్లబోవడమే మన వంతవుతున్నది.
ఏ విధంగా చూసినా ఇది పరీక్షా సమయం. కదన కుతూహల రాగం వినిపించాల్సిన సందర్భం.
దేశ చరిత్రనూ విజ్ఞానాన్ని విశాల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే కర్తవ్యం.