పి.శ్రీనివాస్ గౌడ్
99494 29449
A poem is an adventure, a run away horse of leaps and surprises, words that toss you out of the saddle. — Chris Beckett, The poetry paper
కవిత్వం నిజంగానే ఒక సాహస క్రియ అయితే కవి సాహసి. పొగరుబోతు కవిత్వ గుర్రాన్నీ ఒక్క పెట్టున లంఘిస్తా డు. కళ్లెం బిగించి దౌడు తీయిస్తాడు. జీను మీద లేచి, వెళ్లే దారిలో పదఘట్టనల దుమ్ము రేపుతాడు. మలుపుల్లో ఒక కొత్త పదంతో ఒక కొత్త ముక్తాయింపుతో ఆశ్చర్య కదనకదం తొక్కిస్తాడు. కానీ మార్గం దుర్గమం.
కాలం ఒక అవరోధం. గాలి ప్రతికూలం. రోగ భూయిష్టం. ప్రాణ చెలగాటం. రాజ్య సహాయం పూజ్యం. గత ప్రావీణ్యాలు పని చేయవు. పాత ఆయుధాలు పనికిరావు. ధైర్యమే శిరాస్త్రణం. కొత్తగా చెక్కిన విల్లంబులే శరణ్యం. శత్రువు కనిపించడు. వినిపించడు. చప్పుడు చేయకుండా కమ్ముకుంటాడు. చుట్టూ ప్రజలు నేలకొరుగుతుంటారు.
ఇది పరాయి దేశంతో తలపడే యుద్ధమా.. తన దేశంతో కలిసి, తన దేశంతో వెరచి, చేసే యుద్ధమా... తనలో ఇంకా బతికున్న మనిషితో చేసే యుద్ధమా? ఇది యుద్ధం అవుతుందో.. పరిసర ప్రకృతి పట్ల ఒక సామరస్య ఒప్పందం అవుతుందో.. ఈ అనంత విశ్వంలో ధూళికణం లాంటి తన ఉనికి కోసం పెనుగులాట అవుతుందో...
ఈ సాహస అశ్వికుడు, కవి నిజం శ్రీరామమూర్తి.
'బూడిద చెట్ల పూలు' కవిత్వంలో కొత్త దారులు తొక్కుతాడు. కొత్త కందకాలు, కంటకాలు దాటుతాడు. భీకర నగరారణ్యాలలో నుంచి ప్రయాణిస్తాడు. కల్లోలిత కాలం మీద నుంచి పోతూ తన చేవ్రాలు పత్రాలు జారవిడుస్తూ వెళతాడు. చీకటిలోకి చికిలించి చూస్తాడు. కవి ఒక్కడిగానే నగరమంతా కలవరపడుతూ కలయ దిరుగుతాడు. దిగులు చీకటి మాటున దాగున్న జీవితాలు చూస్తా డు. రాజ్య పదఘట్టనల కింద కొనప్రాణాల ఆర్తనాదాలు వింటా డు. 'బూడిద చెట్ల పూలు' రాలుస్తున్న నిజాలు చూడమంటాడు.
''అక్షరాల పూలబుట్ట
మురుగువాసన కొడుతోంది.
కొత్తవి పేర్చాలి
భావాల సరోవరం
కలువలు పూయడం మానుకుంది.
మూలాలను సవరించాలి.'' అనే స్ప ృహతో బాధ్యతతో బరువుతో దిగులుతో బయలుదేరతాడు.
నగరమంతా లోకమంతా కరోనా వైరస్ సోకి భయవిహ్వల కనులతో చావడానికి సిద్ధంగా వున్న అనాధ ప్రేతంలా వుంది. కవి నగర నగ స్వరూపం కళ్లారా కంటుంటాడు. మనుషుల మరగుజ్జుతనమే విరాట్ స్వరూపంతో ఎదురవుతుంది. మాటల వెనుక మేట వేసి ఒక కూరూపితనం వుంటుంది. కవి చూపు అక్కడే నిలుస్తుంది.
''మనసు మైలపడి
అంతస్తుల అడుగు జారి
కింద పడతామని
వీధులను మేల్కొలిపే చీపురును
ద్వేషించడం మనకెంతో హాయి
దూరాలను పెంచేదే మనక్కావలసింది
ప్రాణాలను కోరకుంటే కరోనాను
కలకాలం ఇంట్లో కాపురం వుండమనేవాళ్లం' అని అసింట మనుషుల లేకితనాన్ని ఈసడించుకొంటాడు.
''శవాలను మోస్తూ జీవచ్ఛవాలను చూసి
ఒలుకుతున్న కన్నులతో
ప్రాణాలరచేత పట్టుకుని
పరుగులు తీస్తున్న నదులు
గుండె పగిలిన జెండా కింద
ఊపిరి పాయల్లో
నాగులు నర్తిస్తున్న చిద్విషాద నేల'' అని భీతావహంగా
''ప్రాణాలరచేత పట్టుకొని/ పరుగులు తీస్తున్న నదులు'' అని నదిలో శవాల వరద పారడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. దీని కింద పారుతున్న నిజాల్ని పసిగడతాడు.
''వున్నట్టుండి కాడు ఆరిపోయింది
కావలసినవారి కన్నీటి మడుగుల్లో / చితులు తేలుతున్నాయి.''
.........
చేతగానితనానికి సమాధి కట్టమని
మరణానికి గౌరవాగౌరవాలుండవని
గంధపు చెక్కలతో కాల్చినా
అయ్యే బూడిద అదేనని'' కాష్టాల కాడ కూచొని కవి కాలని కట్టెలుగా మిగిలిన కావలసినవారికి వ్యర్థంగా బూడిద చెట్ల పూలను పంచుతుంటాడు.
కరోనా మీద రాబందులా వాలింది రాజ్యం. తప్పెట్లు దీపాలతో మృత్యుగంటని మరింతగా మోగించింది. మంది మాగధుల పురమాయింపు, చాదస్తుల గదమాయింపు పెచ్చుమీరాయి. రాజముద్ర వేసిన మతజాంబీల invasion.
''ప్రయోగశాలలో మనిషి మాటల మృగాలు పుడుతున్నాయి, కామరూప కాయలై నాట్యం చేస్తున్నాయి. యెవరి శవాల మీద వారినే కొత్తగా పుట్టించి తమలా మారుస్తున్నాయి. ఇప్పుడు నేను నా మృతదేహ క్షేత్రంలో మొలిచిన కొత్త మృగాన్ని.'' అని కనుగొన్నాడు.
కవి సర్వాంతర్యామి. సర్వభక్షకుడు. ఏ రూపంలోకైనా.. ఏ పాత్రలోకైనా.. ఏ స్థితిలోకైనా.. ఏ స్వరంలోకైనా మారగలడు. కరోనా లాగ మారగలడు. కరోనాలా మాట్లాడగలడు. కరోనా బాధిత జనమవ్వగలడు. కరోనా సాకుతో ప్రజలను పీలుస్తున్న ప్రభుతవ్వగలడు.A poet can transform into anything. కళ్లనిండా కన్నీళ్లు తీసుకొని, ఒక Giant Serpent లాగ బుసలు కొడుతున్న రాజ్యం ముందు యుద్ధం మరచిన యోధుడిలా నిస్ప ృహ ఆవరించిన సగటు మనిషిలానూ మారి, వారి ఓటమి మాటలను ఒప్పచెప్పగలడు.
''గోదాముల్లో నిల్వ వున్న కోటి టన్నుల ఆహార ధాన్యాలతో
పియమ్ కేర్స్లో మూలుగుతున్న లక్షల కోట్లతో దయ్యాల
రాజ్యం ఏలుకొమ్మని, వల్లకాటి సేద్యం చేసుకొమ్మని నూట ముప్పై కోట్ల సంతకాలతో వుత్తరం రాసి పెడదాం.''
.......
''ప్రతిపక్షం, ప్రతి కంఠం లేని నల్లేరు మీది పాలనారథాన్ని బడా పెట్టుబడుల కంచుకోటల కనుసన్నల్లో అప్రతిహతంగా నడుపుకోవచ్చని, గరీబులు, గర్భ దరిద్రులు, భూమిబంధం కోసం మాసాల తరబడి రాజధానిని ముట్టడించే మూర్ఖ రైతుల బెడద వుండదని జన విశ్లేష సామ్రాజ్యాన్ని కలకాలం పాలించు కోవచ్చని, కో బలి అంటూ కోవిడ్ను దేశమంతటి మీదికి, ప్రజలందరి ప్రాణాలపైకి ఒకేసారి ఆవాహనం చెయ్యాలని సాష్టాంగ పడి ప్రార్థిద్దాం..''
..........
''అనుక్షణ రూకల మిలమిలల దేవతారతిలో, కార్పొరేట్ల కబేళాల మెత్తని కత్తుల వస్తు సుఖాల నిలువు దోపిడీల కాసులమై, తాము చేసిన జనగాయాల మీద తామే చల్లే సంక్షేమ కారాల మెరుపులకు మైమరచి ఓటు ఆరోప్రాణాన్ని/ ముందురాత్రి ఖాళీ చేసిన కోటర్ బాటిల్ మత్తులో ఇవియమ్లలోని వారి పాతాళ గోతుల్లో పడవేచి, పూనా బ్లక్మెయిల్ వొప్పందంతో సంతకం చేసి పశ్చాత్తాప్పడ్డ మహామేధావి నేతలా, అంతటా అన్ని వేళలా మోసపోతున్న, ఆదిమానవ సంతానమై....'' అని అన్నీ తెలిసి తెలవలబోతున్న తమ స్థితిని లోతుగా ఆలోచించి చెప్పగలడు. పామరుడి కన్నా పాట ఎవరు కూర్చగలడు? మట్టి మాటలు ఎవడు చెప్పగలడు? ఓటమిని తల్చుకొని వలవల ఎవడు ఏడవ గలడు? గుండెను బండలుగా పరచి ఎవడు తన చావుని వాడే కవితగా చాటగలడు? పదవిన్యాసంతో అబద్ధపు గోడలు బద్దలు కొట్టగలడు?
Poetry, that the art of the marvelous, of a simultaneous compression of language and an endless expansion of meaning అని, అందుకే Fred D agviar (strong words) చెప్పింది.అర్థ తాత్పర్యాల లోతులు కొన్నింటికి అందవు.
కవి బహిరంగ విషాద నేపథ్యాన్ని భరించడానికి తనలో తాను ఒక outlet ఏర్పాటు చేసుకుంటాడు. అది ఒక్కోసారి వ్యంగ్యంగా, satiricalగా బయట పడుతుంది. కవి స్వరంలో ఒక అవహేళన ప్రత్యక్షం అవుతుంది. ఒకో వాక్యం వెనుక ఒక తిరగబడిన మానవ విషాదముంటుంది.
''ఆసుపత్రి వంక చూడొద్దు
బెడ్ కోసం కల కనొద్దు
వ్యాక్సిన్ బాటిల్ లో వున్నది టీకానా
మురికినీరా అని అడగొద్దు
సిలిండిర్ ఫుల్లా ఖాళీయా అని అసలే వాకబు చేయొద్దు.''
ఇది కవి తాను పాడుకుంటూ వెళ్లిన కవిత్వమంతా అంతర్ప్ర వాహంగా వుంటూనే వుంటుంది. బాధ్యత మరిచిన సాధారణ పౌరుడికైనా, కార్పొరేట్ల కోరలు తోముతున్న మత రాజ్యాలకు అయినా ఒకటే చురక. వాత. కవి తను జారవిడుస్తున్న తన చేవ్రాలు పత్రాల నిండా ఈ అధిక్షేపనమే అక్షరాలా మనసుకు మంట పుట్టిస్తుంటుంది.
కవి ఒకోసారి తన కవితాశ్వాన్ని తనలో నిర్నిద్రంగా వుంచి నడుస్తుంటాడు. అపుడు కవితాశ్వం కవిలో అదృశ్యంగా వుంటుంది. ఒకోసారి కవి కవితాశ్వాన్ని నడిపిస్తుంటే.. ఒకోసారి కవితాశ్వం కవిని లాక్కుని అమితవేగంతో దౌడు తీస్తుంది. కవి, అశ్వికుడు ఒకడే అయిన క్షణాలు కవి సమయాలు. ఇలాంటి సమయాల్లో కవి చూపు జ్వాలామయంగా వుంటుంది. తెర వెనుక కప్పబడిన నిజాల్ని నిర్భయంగా బయటకు లాగుతుంది.
''ఒంటరిగా నువ్వు పోరాడుతుంటే, ఎకె ఫార్టీ సెవన్లతో, కిరాయి గన్లతో కాకుంటే 'ఉపా'లతో అనంత గోడల వికృత బలాలతో ఆవు గాండ్రిస్తుంది. నీ తోలొలుస్తుంది''
ఇదీ రాజ్యం. రోజువారీ మనం చూస్తూనే వుంటాం. చదువు తూనే వుంటాం. మాట్లాడలేం. నిజం చెప్పలేం. గొంతు అనేక కారణాల చేత పూడుకుపోయుంటుంది. కవి ఇక్కడే తన గొంతు విప్పుతాడు. కారణాలు పాడతాడు. జరిగింది వైనంగా చెపుతూ కళ్ల పొరలు విప్పుతాడు.
''రూపాయి ఉయ్యాల గానానికి జోగిపోయి నిద్రపోడానికి అలవాటు పడినప్పుడే అంతా అయిపోయింది./ ఎంత పైకి ఎగిరినా దారం పట్టుకున్నవాడి పాదాల వద్దకు వచ్చి తీరవలసిన గాలిపటా లమయ్యాము.'' ఈ నిస్సహాయతకి కారణం తెలియని తనమా... తెలివిడిలేని తనమా.. తప్పు దారి పోతున్నా కాంచలేని తనమా?
''తామున్న గుడిసె కప్పుకున్న ఆకు దుప్పటి
ఏ తాటిదో చెప్పగలరు కాని
అందులోని దీపాన్ని ఆర్పేస్తున్న చేతులను
శాసించేదెవరో వూహించనైనానా లేరు''
ఈ అల్ప పరిస్థితిలో మార్పు కోసమే కవి కవిత్వ కత్తి పట్టాడు. లో చూపుతో ఒక మాట... చాలా లోతైన మాట జనానికి చెపుతున్నాడు... : ''వేలి సిరాగుర్తు ఇక్కడ సువిశాల శిలువ''
ఇది గుర్తెరగాలి. ఈ శిలువ దించుకోవాలి. ఈ సమాధి స్థితిని పెకలించుకు రావాలి. కళ్లు తెరుచుకు చూడాలి. మేలు కోవాలి. కాలం కాలం పొడుగున అవకాశాలు ఇవ్వదు.
''మేలుకోవడం తెలియని జాతికి
గుండు గొట్టించే వారే గురువులు.'' అనడానికి కవికి కాలం అవకాశం ఇచ్చింది. బుజువవుతున్న వాస్తవాలే కవి చేవ్రాలు పత్రాలు కదా.. కాలాన్ని తమ పంచన కట్టేసుకోవడం తెలియని వారి దగ్గర మంచికాలం వుండదు కదా...
కొన్నేసిసార్లు కవి తనలో తాను పాడుకుంటాడు. సమూహం మరచిన పాట. 'మా ఇంటి వాన' జ్ఞాపకాల వాన లాంటి పాట. తనలో బాల్యాన్ని బతికించుకునే పాట. తన జాతిని నిద్రలోంచి లేపే పాట. ఒకరికొకరు చేతులు కలిపి, గొంతులు కలిపి గానం చేయాల్సిన పాట.
''ఒక నువ్వు వొక నేను / రెండు వాగులై నాగులై
జగన్నాట్యం చేయగలం
మడి, గింజయి దిక్కులను కలిపే
హరిత బంధమై అలరించగలం /
ఒక నువ్వు వొక నేను/ చేద తాడై బావిని పారించగలం
చేయి సమ్మెటై, కొలిమిని పనిముట్లను చేయగలం/
ఏకలింగ ప్రసవాలు, వొంటి చేతి తప్పట్లు
గాలి లేని కొమ్మల పూనకాలు/ ద్రవం లేని ధారలు
ఒకే కుల ఒకే మత జాతులే ప్రకృతి విరుద్ధాలు''
ఇదే దారి. నడవాల్సిన దారి. వేసుకోవాల్సిన దారి. కల కనాల్సిన దారి.
'కాలం మారినప్పుడల్లా కాలనియమాలు మారతాయి. ప్రభుత మారినపుడల్లా అణచివేత విధానాలు మారతాయి.' ఆట స్థలమొకటే.. ఆట మారింది.' మతం ముఖచిత్రంగా మారణ హౌమాలు ఆరని మంటలు దేశమంతా చెలరేగుతున్నప్పుడు ఆ చితుల మధ్య కవి దిమ్మరిలా, హృదయం రాలిపడ్డ ఒక సూఫీ కవిలా.. ఒక్కడే దీనార్తరావాల్ని ప్రపంచానికి చేరవేయ గలడు. ఒక విఫల గీతమయినా పాడగలడు.
''నన్ను తెలుసుకోవాలంటే నా వైపు చూడొద్దు
నా చుట్టూ వేలు లక్షల మైళ్లు పరికించండి.'' అని జరుగు తున్న వినాశనాన్ని వేలు పట్టుకు చూయించగలడు. కవి ఎంత కొట్టి చంపినా చావని పాము. ఎంత మొదలు కంటా నరికేసినా మళ్లీ చిరునవ్వు మొలకేసే చెట్టు.
బండరాళ్ల మధ్య తలెత్తే పచ్చదనం. కార్పొరేట్టు రాసుకునే రూపాయల కావ్యంలో పొసగని వాక్యం. లొంగని పిడికిలి.
''చెట్లు కూలుతూ/ మళ్లీ లేస్తున్నాయి.
గొడ్డలి ఎంత నెత్తురు తాగుతున్నా
హరిత రక్తాన్ని/ తిరిగి నింపుకుంటున్నాయి
పుట్టిన మట్టిని పూసుకొని/ కొత్తపూలు పూస్తున్నాయి.
.......
ఆద్యంతాల మధ్య యుద్ధం
సరికొత్త ఆదికి పునాది వేస్తుంది
వర్తమానం కడుపున రేపటి
కాంతి బీజాలను జల్లుతుంది'' అని తనని తాను మళ్లీ బూడిద లోంచి కట్టుకుంటా వస్తాడు.మళ్లీ మళ్లీ మనిషిని ఊపిరిలూదుతూ వుంటాడు. లోకమంతా ఒకవైపు.. కవి ఒకవైపు..
''ఏ పక్షినోటి బీజం, ఏ క్షేత్ర గర్భవాసి అవుతుందో...''నని కలగంటుంటాడు. కత్తి పక్కన పెట్టడు. కంఠం తెగి పడినా కవితాశ్వం దిగడు. చేతనైన నమార్గాల్లో తన మాట వదిలి పోతూనే వుంటాడు. కాల ప్రవాహాన్ని ఎదురీదుతూ.. కాల పరీక్షల రాటుదేలే వాక్యాల పదవిన్యాస అస్త్రశస్త్రాలను సదా సిద్ధం చేసుకుంటూ.
అశ్వికుడి ఎదురుగా అనంతంగా పరుచుకొని అరణ్యం.. మానవారణ్యం.. నగరారణ్యం.. పచ్చదనం ఆవిరౌతూ .. నదికళ్ల నీళ్లు అడుగంటుతూ ..
ఈ అశ్వికుడు 'నిజం' కలం పేరు కలిగిన శ్రీరామమూర్తి, మొదలు (నిజం గీతాలు 1972 ), ఎర్ర మందారాలు (1974), నివురు ( 2018 ), నాలుగో పాదం ( 2020), అలలు (2020) అంటూ కొన్ని అక్షరాల పొత్తాలతో సమాజంతో యుద్ధమూ, సామరస్యమూ ఏకకాలంలో చేశాడు. ఇంకా అలుపెరగక చేస్తున్నాడు. అశ్వికుడు కత్తిపట్టిన చేతికి ఇంకా చేతి నిండా పని వుంది. తూరుపు ఎదురుచూస్తూ వుంది. ఈ అశ్వికుడు సమాజాన్ని పహరా కాయాల్సిన అవసరం మునుముందు చాలా వుంది. ప్రతులకు : 98483 51806